- రికార్డు స్థాయిలో అమ్మకాలు.. నిరుటి కంటే 4 వేల కోట్లు ఎక్కువ
- టాప్లో రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలు
- సర్కార్ ఖజానాకు రూ.29 వేల కోట్లు.. సేల్స్పై ఎక్సైజ్ శాఖ రిపోర్ట్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు : లిక్కర్ అమ్మకాలు, ఆదాయంలో రాష్ట్ర సర్కార్ దూసుకుపోతున్నది. పోయిన ఏడాది కంటే ఈసారి అమ్మకాలు భారీగా పెంచింది. 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఏకంగా రూ.34,117 కోట్ల విలువ చేసే లిక్కర్ (ఐఎంఎల్), బీర్లు అమ్మి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఈ అమ్మకాలతో ప్రభుత్వానికి దాదాపు రూ.29 వేల కోట్ల ఆదాయం వచ్చింది. టార్గెట్ల పేరుతో సేల్స్ విపరీతంగా ప్రోత్సహించడంతో ప్రభుత్వానికి ఇన్కమ్ పెరుగుతోంది. అదే టైమ్లో పెంచిన లిక్కర్ ధరలు కూడా కలిసివచ్చాయి. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఈసారి 4 వేల కోట్ల రూపాయల విలువజేసే లిక్కర్ అదనంగా సేల్అయింది.
ఈ జిల్లాలే టాప్
మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్లో నల్గొండ జిల్లా ఉంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.7,839 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆ తరువాత హైదరాబాద్లో రూ.3,652 కోట్లు, నల్గొండలో రూ.3,447 కోట్లు, వరంగల్ అర్బన్లో రూ.3,395 కోట్లు, కరీంనగర్లో రూ.2,893 కోట్లు, మెదక్లో రూ.2,841 కోట్లు, మహబూబ్ నగర్లో రూ.2,415 కోట్లు, ఖమ్మంలో రూ.2,145 కోట్లు విలువజేసే సేల్స్ జరిపినట్లు ఎక్సైజ్ శాఖ
రిపోర్టులో వెల్లడించింది.
..లిక్కర్ సేల్స్ 34 వేల కోట్లు
ఇక నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో రూ.1,500 కోట్లు దాటింది. మొత్తంగా రూ.34,117 కోట్లు సేల్స్ జరిపింది. లిక్కర్ ఆదాయం రోజుకు రూ.90 కోట్లు
ఈ ఏడాది మేలో ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచింది. బ్రాండ్లను బట్టి దాదాపు 20 నుంచి 25 శాతం వరకు రేట్లు పెంచింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు లిక్కర్ ఆదాయం వివరాలు గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సగటున రోజుకు రూ.90 కోట్లు సమకూరుతున్నది. ఇలా నెలకు రూ.2500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు ఖజానాకు చేరుతోంది. ఈసారి 3.56 కోట్ల కేసుల ఐఎంఎల్, 4.58 కోట్ల కేసుల బీరు అమ్ముడైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి3.67 కోట్ల కేసుల ఐఎంఎల్, 3.24 కోట్ల కేసుల బీరు అమ్మారు.
పండుగలు, ఈవెంట్లు టార్గెట్గా సేల్స్
రాష్ట్రంలో జోరుగా లిక్కర్ సేల్స్ జరుగుతున్నా..ఇంకింత సేల్స్ జరిగేలా సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం వైన్స్లకు, బార్లకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మిపిస్తున్నది. ఏదైనా పండుగ వచ్చినా.. ఇతర ఆకేషన్లు ఉన్నా లిక్కర్ అమ్మకాలు పెరగాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈసారి కొత్తగా404 వైన్ షాపులను పెంచుతూ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంతో 2,216 ఉన్న వైన్స్ సంఖ్య 2,620కు చేరింది. కొత్తగా 159 బార్లకు లైసెన్స్లు ఇచ్చింది. వీటితో పాటు ఇబ్బడిముబ్బడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. ఈసారి మునుగోడు బై ఎలక్షన్స్ సందర్భంగా ఆ నియోజకవర్గం, ఇతర పరిసర ప్రాంతాలలో మద్యం ఏరులై పారింది. బైఎలక్షన్తో అదనంగా రూ.200 కోట్ల లిక్కర్ అమ్మినట్టు ఆఫీసర్లు పేర్కొన్నారు.