- న్యూ ఇయర్ వేడుకల్లో తాగి ఊగిన మందుబాబులు
- నెలంతా లిక్కర్ వ్యాపారులకు జాక్పాట్
- మొత్తం రూ.246 కోట్ల బిజినెస్
నిజామాబాద్, వెలుగు : కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు మద్యం మత్తులో మునిగిపోయారు. మందు కిక్కుతో న్యూ ఇయర్కు వెల్కమ్ పలికారు. మామూలుగా రోజుకు సగటున రూ.6 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా, డిసెంబర్ 31న సుమారు రూ.60 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు కలిసి డిసెంబర్ నెలంతా మద్యం వ్యాపారం రూ.246.68 కోట్లకు చేరింది.
గతేడాది డిసెంబర్లో రూ.184.58 కోట్లు వ్యాపారం కాగా, ఈసారి 33 శాతం పెరిగింది. కొత్త లైసెన్స్లతో ప్రారంభమైన వైన్స్, బార్ల యజమానులకు జీపీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు జాక్పాట్లా మారాయి.
సందర్భం ఏదైనా మందే ప్రధానం..
ఉమ్మడి జిల్లా జనాభా 27.97 లక్షలు కాగా, ఇందులో 14.25 లక్షల మహిళలు, 13.72 లక్షల పురుషులు ఉన్నారు. యూత్ జనాభా 9 లక్షల వరకు ఉంది. పండుగలు, శుభకార్యాలు, వేడుకలు అన్నీ మద్యం విందులతోనే నిర్వహించుకోవడం అలవాటుగా మారింది. ఆరోగ్యం, ఖర్చు అనే అంశాలను లెక్కచేయకుండా తాగి చిందులేయడమే వినోదంగా భావిస్తున్నారు. సందర్భం ఏదైనా ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. లాభాల కోసం వ్యాపారులు పెట్టుబడులకు వెనకాడటం లేదు.
లిక్కర్కే ప్రయారిటీ..
ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్ షాపులు, 28 బార్లు ఉన్నాయి. మాక్లూర్ మండల కేంద్రంలోని ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) డిపో నుంచి మద్యం సరఫరా జరుగుతోంది. జీపీ ఎన్నికలు, న్యూఇయర్ కలిపి డిసెంబర్ నెలలో 4,69,350 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి.
ఇందులో 2,40,458 కేసుల లిక్కర్, 2,28,892 కేసుల బీర్లు ఉన్నాయి. మొత్తం వ్యాపారంలో 33 శాతం వృద్ధిని ఆబ్కారీ శాఖ నమోదు చేసింది. న్యూఇయర్ వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన 130 మంది మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
