- హాట్స్పాట్లలో మరింత కఠినం..
- మిగతా చోట్ల కొన్ని సడలింపులు?
- కరోనాపై పోరాడుతూనే ఎకానమీపై దృష్టిపెట్టాలి
- సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ను ఒకేసారి ఎత్తేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ ఇండికేషన్ ఇచ్చారు. దశలవారీగానే ఆంక్షలను ఎత్తేస్తామని, అది కూడా కేసుల సంఖ్య, కరోనా తీవ్రతను బట్టే నిర్ణయం ఉంటుందని సిగ్నల్ ఇచ్చారు. లాక్డౌన్ను పొడిగించాలని పలు రాష్ర్టాలు కోరడంతో ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. వైరస్ తీవ్రతను బట్టి జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి.. ఎగ్జిట్ ప్లాన్ రెడీ చేయాలని సీఎంలను మోడీ ఆదేశించారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మే 3వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేతకు అవకాశం ఉందని, కానీ కరోనా హాట్స్పాట్లలో ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. అయితే ఎలాంటి నిర్ణయమైనా మే 3న లేదా ఒకటి రెండు రోజుల ముందే తీసుకుంటారని చెప్పాయి.
కేసులు లేని, చాలా తక్కువ కేసులు ఉన్న గ్రీన్, ఆరెంజ్ జిల్లాల్లో ఎకనమిక్ యాక్టివిటీలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొన్ని ఆంక్షలతో ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై బ్యాన్ కొనసాగించాలని మోడీ ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు మూసేయాలని, అలాగే రిలీజియస్ మీటింగ్స్, ఇతర సమావేశాలపై నిషేధం ఉంటుందని చెప్పారు. అలాగే హాట్స్పాట్ జోన్లలో ప్రభుత్వ గైడ్లైన్స్ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
వేగంగా స్పందించాలి..
వేగంగా స్పందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం అని మోడీ అన్నారు. చాలా మంది తమకు దగ్గు, జలులు, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న మైగ్రెంట్ లేబర్లు, ఇతర దేశాల్లో ఉండిపోయిన స్టూడెంట్లు, టూరిస్టుల గురించి మీటింగ్లో చర్చించారు. విదేశాల్లో ఉన్న ఇండియన్లను ఇక్కడికి తీసుకురావడంలో ఇబ్బందులు, వారి కుటుంబాలకు రిస్క్ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని మోడీ అన్నారు.
ఎత్తేయాలి.. వద్దు పొడిగించాలి..
లాక్డౌన్ పొడిగింపు విషయంలో సీఎంలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రుల్లో ఐదుగురు లాక్డౌన్ను ఎండ్ చేయాలని కోరారు. నలుగురు మాత్రం పొడిగింపు వైపు మొగ్గు చూపారు. మేఘాలయ, ఒడిశా సీఎంలు లాక్డౌన్ను పొడిగించాలని కోరారు. కొందరు సీఎంలు ఎకనామీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎకనమిక్ యాక్టివిటీలను మెల్లగా ప్రారంభించాలని చెప్పారు. మార్చి 22 నుంచి ఇప్పటిదాకా ప్రధాని నాలుగు సార్లు సీఎంలతో ఇంటరాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్, పీఎంవో, హెల్త్ మినిస్ర్టీ అధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు.
మే 3 తర్వాతి ప్లాన్ రెడీ చేస్తున్నం: మధ్యప్రదేశ్
మే 3 తర్వాత ఎలా ముందుకెళ్లాలో ప్లాన్స్ రెడీ చేయాలని రాష్ట్ర అధికారులను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఎకనామిక్ యాక్టివిటీలపై విధివిధానాలు రెడీ చేయాలన్నారు.
కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటం: బీహార్
లాక్డౌన్ పొడిగించాలా వద్దా అనేది కేంద్రం నిర్ణయమని బీహార్ సీఎం నితీశ్కుమార్ చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందు ఎక్స్పర్ట్స్ అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
లాక్డౌన్ పొడిగించండి: మేఘాలయ
లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రాన్ని మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కోరారు. దేశవ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ వాడితే బాగుంటుందని సూచించారు. ఎకనామిక్ యాక్టివిటీని మళ్లీ స్టార్ట్ చేసేందుకు సలహాల కోసం అన్ని రాష్ట్రాలతో కలిపి ఎకనామిక్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు.
లాక్డౌన్ వైపే మొగ్గు: వెస్ట్ బెంగాల్
లాక్డౌన్ పొడిగింపుకే తాము మొగ్గు చూపుతున్నామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లాక్డౌన్పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయట్లేదని, అసలు క్లారిటీనే లేదని అన్నారు. ఓవైపు లాక్డౌన్ అంటూనే మరోవైపు షాపులు తెరుచుకోవచ్చని సడలింపులిస్తోందని, షాపులు తెరిస్తే లాక్డౌన్ అమలు ఎట్ల కుదురుతుందని ప్రశ్నించారు. లాక్డౌన్పై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు.
కట్టడి చేయాలంటే పొడిగించాలి: హిమాచల్ ప్రదేశ్
కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ను పొడిగించాల్సిందేనని కేంద్రానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు. కేసులు పెరుగుతున్నందున మనుషుల మూమెంట్పై ఆంక్షలు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. అయితే ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం జరగాలని చెప్పారు. ముఖ్యంగా గ్రీన్ జోన్లలో అనుమతివ్వాలని కోరారు.
పొడిగించాలి.. ఎకానమీ నడవాలి: ఒడిశా
నేషనల్ లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. అయితే ముఖ్యమైన యాక్టివిటీలు మాత్రం జరగనివ్వాలన్నారు. ఎకనమిక్ యాక్టివిటీలను రాష్ట్రం పరిధిలోనే అనుమతించాలని కోరారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజలను వాళ్ల సొంతూర్లకు పంపేందుకు సరైన ప్రొసీజర్ను రూపొందించాలన్నారు.
వాళ్లకు పైసలు చేతికే ఇవ్వండి: తమిళనాడు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వర్కర్లకు డబ్బులను పంచాయతీ సెక్రటరీల ద్వారా డైరెక్ట్గా అందించాలని కేంద్రాన్ని తమిళనాడు సీఎం కే పళనిస్వామి కోరారు. దీని వల్ల బ్యాంకుల దగ్గర జనాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. కరోనా టెస్టులు 10 వేలకు పెంచేందుకు వీలుగా ఆర్టీ పీసీఆర్ కిట్లు పంపాలని కేంద్రాన్ని కోరారు. కాగా, లాక్డౌన్పై ఆ రాష్ట్రం అభిప్రాయమేంటో ఇంకా తెలియరాలేదు.
పొడిగింపు వైపే చూస్తున్నం: గోవా
రాష్ట్రంలో లాక్డౌన్ను పొడిగించాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. లాక్డౌన్ను పొడిగించాల్సిందిగా సీఎంకు లేఖ కూడా రాస్తామన్నారు. గోవా బార్డర్లైతే మూసే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీ మెల్లమెల్లగా మొదలవుతుందని తెలిపారు.
3వ తేదీ వరకు షాపులు క్లోజ్: జార్ఖండ్
రాష్ట్రంలో మే 3 వరకు షాపులను రీ ఓపెన్ చేయబోమని జార్ఖండ్ స్పష్టం చేసింది. దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చంటూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయబోమంది. రాష్ట్ర బార్డర్లను కూడా ఓపెన్ చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ చెప్పారు.
దశలవారీగా ఎత్తేయండి: గుజరాత్
లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేయాలని కేంద్రాన్ని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కోరారు. పొడిగించాలనుకుంటే రోజువారీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు, పెద్ద షాపుల ఓనర్ల గురించి ఆలోచించాలన్నారు. కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తూ కేసులు తగ్గుతున్న విధానాన్ని బట్టి లాక్డౌన్ను మెల్లమెల్లగా ఎత్తేస్తామని తెలిపారు.
వాతావరణంలో మార్పులొస్తాయి భద్రం.. ముఖ్యమంత్రులతో మోడీ
లాక్డౌన్ మంచి ఫలితాలు ఇచ్చింది. వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగాం. చాలా దేశాల జనాభా అంతా కలిపితే ఎంత ఉంటుందో.. మన దేశ జనాభా అంత ఉంటుంది. అయినా కట్టడి చేయగలిగాం. అయితే వైరస్ ప్రమాదం ఇంకా పోలేదు. మనం నిరంతరం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. జబ్బులు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ముందుకెళ్లాలి.
రెండు గజాల దూరం
కరోనా హాట్స్పాట్ జోన్లలో మరింత కఠినంగా లాక్డౌన్ గైడ్లైన్స్ అమలు చేయాలని, దో గజ్ దూరీ (రెండు గజాల దూరం) మంత్రాన్ని తప్పనిసరిగా ఫాలో కావాలని మోడీ అన్నారు. టెక్నాలజీని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలని, రీఫార్మ్స్కు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘ఇప్పటిదాకా రెండు లాక్డౌన్లను దేశం చూసింది. తొలి దశలో కఠినమైన చర్యలు తీసుకున్నాం. రెండో దశలో కొన్ని సడలింపులు ఇచ్చాం. రాష్ట్రాలు చాలా బాగా పని చేశాయి. మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఇప్పుడు ఆలోచించాలి. కరోనా వైరస్ ప్రభావం రాబోయే కొన్ని నెలలపాటు కనిపిస్తుందని ఎక్స్పర్టులు అభిప్రాయపడుతున్నారు” అని ఆయన చెప్పారు. భవిష్యత్లో కూడా మాస్క్లు వేసుకోవడం మన జీవితంలో భాగం కావొచ్చని అన్నారు.