- కేంద్ర హోం శాఖకు పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశం
- రాష్ట్ర సీఎస్, డీజీపీ, నిజామాబాద్ కలెక్టర్, సీపీకి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ మీద జరిగిన దాడి ఘటనపై లోక్ సభ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. విచారణ జరిపి 15 రోజుల్లో రిపోర్టివ్వాలని హోంశాఖను శుక్రవారం ఆదేశించింది. ఎంపీ అర్వింద్ అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర సీఎస్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్మూర్ పోలీసులకు నోటీసులిచ్చింది. జనవరి 25న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అర్వింద్ కాన్వాయ్పై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో దాడి జరిగింది. పలువురు టీఆర్ఎస్ లీడర్లు కత్తులతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ ఘటనలో ఎంపీ వెహికల్తో పాటు కాన్వాయ్లోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, పోలీసుల సాయంతోనే రాష్ట్ర సర్కారు తన హత్యకు ప్లాన్ చేసిందని అర్వింద్ ఆరోపించారు. జనవరి 30న పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు