రాముడు ఆదర్శపురుషుడు... ఎలా అంటే...

రాముడు ఆదర్శపురుషుడు... ఎలా అంటే...

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన తనయుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో షోడస (16) గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. ఆ సుగుణాలు ఇవే…

గుణవంతుడు, వీర్యవంతుడు , ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు
సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, వేద వేదాంతాలను తెలిసివాడు
అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు
ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు, ధైర్యవంతుడు
క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు
అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు…

ఈ 16 సుగుణాలే శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.

శ్రీ మహా విష్ణువు.. త్రేతాయుగంలో... మానవ రూపంలో అయోధ్యలో క్షత్రియుడిగా  శ్రీరాముడిగా జన్మించాడు..ఎక్కడా దైవత్వం చూపించకుండా మానవుడిలానే పెరిగాడు.. జీవితంలో ఓ మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాడు..కానీ ఎక్కడా తొణకలేదు, ధర్మాన్ని వీడలేదు, అసత్యం చెప్పలేదు.  శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారంలోనూ మానవుడి గురించి ప్రస్తావన రాలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించలేదు( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు) . రామస్య ఆయనం రామాయణం అంటారు కదా. ..మరి రాముడి కదలికకు చాలా  ప్రాధాన్యత  వచ్చింది. ఎందుకంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం . సాధారణ మానవుడిలా జన్మించి..చివరకు మానవుడిలానే అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. అందుకే రాముడి ప్రతి అడుగు ఆదర్శం…రాముడే ఆదర్శ పురుషుడు…

కృత యుగంలో ఓ సందర్భంలో నారదుడికి ..- వాల్మీకి మధ్య ఓ చర్చ జరిగిందని స్కంధ పురాణం 16 వ అధ్యాయంలో రుషిపుంగవులు పేర్కొన్నారు.  నిత్యం సత్యం పలికే వాడు, నిరతము ధర్మం నిలిపే వాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యునివలనే వెలిగే వాడు, ఎల్లరికి చలచల్లని వాడు, ఎదనిండా దయగల వాడు…సరియగునడవడివాడు…ఈ లోకంలో ఎవరున్నారని వాల్మికి మహర్షి ... నారద మహర్షిని ప్రశ్నించాడు. 

  త్రేతా యుగంలో శ్రీమహావిష్ణువు మానవుడి రూపంలో క్షత్రియుడిగా జన్మిస్తాడని ... ఆయనే శ్రీరామచంద్రునిగా, సత్యాన్ని.. ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ లోకానికి ఆదర్శంగా నిలుస్తాడని  వాల్మికి మహర్షి అడిగిన ప్రశ్నలన్నింటికి  చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు. ఓం కారానికి సరి జోడు... జగములు పొగిడే మొనగాడు...  విలువలు కలిగిన విలుకాడు.... పలు సుగుణాలకు చెలికాడు...  చెరగని నగవుల నెలరేడు... మాటకు నిలబడు ఇలరేడు..దశరధ తనయుడు... దానవ దమనుడు ...జానకిరాముడు…అతడే శ్రీరాముడు  అని సమాధానం ఇచ్చాడని వేదాలు చెబుతున్నాయి.