పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య
  • కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలో ఘటన

కృష్ణా జిల్లా: మోపిదేవి మండలంలో పెద్దకళ్లేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పి.సాయి (22) తమ గ్రామానికే చెందిన 14 ఏళ్ల బాలికతో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.. ఇరువైపులా పెద్దలు సుముఖంగా కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిన్న శనివారం ఉదయమే తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ఇరువురూ ఊరిబయట శివారు ప్రాంతంలో కలుసుకున్నారు. పెళ్లి గురించి మాట్లాడుకుంటే.. పెద్దలు ఒప్పుకునే పరిస్థితి లేదని విలపించినట్లు సమాచారం. ఒకర్ని విడిచి మరొకరం ఉండలేమని తీర్మానిచుకున్న ఇరువురు పెద్దకలల్లేపల్లి సమీపంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నారు.

శనివారం లాక్ డౌన్ సమయం మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం అయినా ఇరువురూ ఇళ్లకు చేరుకోకపోవడంతో పెద్దలు పోలీసులను ఆశ్రయించారు. శనివారం రాత్రి చీకటిపడడంతో అన్ని చోట్ల ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం ఉదయం లాక్ డౌన్ సడలింపు సమయంలో అటువైపు వెళ్లిన వారికి చెట్టుకు ఉరేసుకుని వేళాడుతున్న జంట కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా చల్లపల్లి ఎస్.ఐ నాగరాజు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం తో ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.