
- మంచిర్యాల టౌన్ లోని కాలనీల వాసుల ఇబ్బందులు
- కిలోమీటర్ల దూరం ప్రయాణించి టౌన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి
- ఏండ్లుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం
- త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలంటున్న స్థానికులు
మంచిర్యాల, వెలుగు: భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని రాళ్ల వాగుపైన లో లెవల్ కాజ్వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో అవతలివైపు వెళ్లే కాలనీలవాసులకు రాస్తా బంద్ అయింది. ఈ నెల13న కురిసిన వానకు భారీగా వరద పారడంతో మట్టి కోతకు గురైన కాజ్ వే పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పవర్హౌస్ కాలనీ, రంగంపేట, అండాలమ్మ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. బైక్ లపై అతికష్టంగా వెళ్తుండగా, ఫోర్ వీలర్స్ రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మంచిర్యాల టౌన్ లోకి వచ్చేందుకు ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏసీసీ రోడ్, పాత మంచిర్యాల వైపు నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి టౌన్కు చేరుకుంటున్నారు.
ఏండ్లుగా అవస్థలే..
మంచిర్యాల బైపాస్రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం సమీపంలో రాళ్లవాగుపై 2005లో రూ.80 లక్షల మున్సిపల్ఫండ్స్తో లో లెవల్కాజ్వే నిర్మించారు. అప్పటి నుంచి రంగంపేట, పవర్హౌస్కాలనీ, అండాలమ్మ కాలనీల ప్రజలు కాజ్వే మీదుగా సిటీలోకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అంతకుముందు అండాలమ్మ కాలనీ వాసులు ఏసీసీ మీదుగా 3 కిలోమీటర్లు దూరం ప్రయాణించేవారు. కాజ్వే నిర్మాణంతో అర కిలోమీటరు సమీపంలోనే ఉన్న మంచిర్యాలకు చేరుకుంటున్నారు. పాలు, కూరగాయాలు వంటి నిత్యావసరాలు అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకు టౌన్కు ప్రజలు వస్తుంటారు. 2019లో రాళ్ల వాగుకు భారీ వరదలు రావడంతో కాజ్వే పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది.
హై లెవల్ బ్రిడ్జి పనులు లేట్
రాళ్లవాగుపై హైలెవల్బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు రూ.13.50 కోట్ల టీయూఎఫ్ఐడీసీ ఫండ్స్తో 2024 మార్చిలో భూమిపూజ చేశారు. ఏడాదిన్నర కావస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. తర్వాత బ్రిడ్జి అంచనా వ్యయాన్ని రూ.20 కోట్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపారు. అనంతరం రూ.196 కోట్లతో రాళ్లవాగు మీదుగా సిక్స్లేన్రోడ్డు సాంక్షన్అయింది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగానే హైలెవల్ బ్రిడ్జి నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేశారు.
ఈ ఏడాది మే నెలలో వాగులో డ్రిల్లింగ్చేసి సాయిల్టెస్టు చేశారు. ఆ తర్వాత బ్రిడ్జి పనులు ముందుకు సాగలేదు. ఎప్పటిలాగే మొన్నటి వరదకు కాజ్వే కొట్టుకుపోయింది. మళ్లీ మట్టిపోసి టెంపరరీగా రిపేర్ చేసినా ఉపయోగంగా ఉండదు. వీలైనంత తొందరగా హైలెవల్బ్రిడ్జి నిర్మించాలని స్థానిక కాలనీల వాసులు డిమాండ్చేస్తున్నారు.