- బెడ్ల సంఖ్య పెరుగుతున్నా పెరగని ఆస్పత్రుల స్టాఫ్
- ఆస్పత్రుల్లో వైద్యులు లేక రోగుల ఇబ్బందులు
- తూతూమంత్రంగా అప్ గ్రేడ్ చేస్తున్న ప్రభుత్వం
జయశంకర్ భూపాలపల్లి/ నెట్వర్క్, వెలుగు : ఇటీవల పీహెచ్సీలను, ఏరియా హాస్పిటళ్లను అప్గ్రేడ్ చేస్తూ బెడ్ల సంఖ్యను పెంచుతున్న ప్రభుత్వం ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలేదు. కొత్తగా డాక్టర్లను, స్థాఫ్ను నియమించడంలేదు. సర్కారు ఇచ్చే జీతాలు తక్కువగా ఉండడంతో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. దవాఖానాల పేర్లు మారుతున్నాయే తప్ప ట్రీట్మెంట్ మెరుగుపడడంలేదు. సరిపడా టెక్నికల్ స్టాఫ్, ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో టెస్టులూ చేయడం లేదు. దీంతో పేషెంట్లు ఎప్పట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
కేవలం బెడ్లు పెంచి వదిలేస్తున్నరు..
స్టేట్వైడ్ పెద్దసంఖ్యలో పీహెచ్సీలను కమ్యూనిటీ హస్పిటళ్లుగా మార్చి, బెడ్ల సంఖ్యను 10 నుంచి 30కి పెంచారు. కొన్ని సెంటర్లలో 50 బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల్లోని అన్ని ఏరియా దవాఖానాలను జిల్లా స్థాయికి, మెడికల్ కాలేజీలు మంజూరైన చోట్ల జిల్లా స్థాయినుంచి జనరల్ హాస్పిటళ్లుగా అప్గ్రేడ్ చేశారు. కానీ ఆ స్థాయిలో స్టాఫ్ను కేటాయించలేదు. ముఖ్యంగా స్పెషలిస్టులను నియమించకపోవడం, అవసరమైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేటు హాస్పిటల్స్కే పోతున్నారు. వాస్తవానికి వంద పడకల హాస్పిటల్లో 40 మంది డాక్టర్లు ఉండాలి. ఇందులో 15 మంది జనరల్, 25 మంది స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి. కనీసం 100 మంది నర్సులుండాలి. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ ను నియమించలేదు. ఏరియా, జిల్లా దవాఖానాలుగా మారిన చోట్ల ఎక్కడా కొత్త పరికరాలను మంజూరు చేయలేదు. చాలాచోట్ల ఎక్స్రే మెషీన్లు, స్కానింగ్ పరికరాలు కూడా లేక పేషెంట్లు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తున్నారు. గతంలో కొన్ని పరికరాలున్నా టెక్నీషియన్లు లేక అవన్నీ మూలనపడ్డాయి. ఎక్స్రే రూమ్లకు చాలాకాలంగా తాళాలు పడ్డాయి.
డాక్టర్లు ముందుకురావట్లే..
జిల్లాల్లోని వివిధ దవాఖానాల్లో డాక్టర్ పోస్టుల భర్తీకి కలెక్టర్లు తరుచూ నోటిఫికేషన్లు ఇస్తున్నా స్పందన రావడం లేదు. బయట ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లకు రూ.2లక్షల దాకా, స్పెషలిస్టులకు రూ.4 లక్షల నుంచి 5లక్షల దాకా జీతాలున్నాయి. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్లకు నెలకు రూ.50 నుంచి రూ.60వేలు, స్పెషలిస్టులకు రూ. లక్షా 20వేలు మాత్రమే ఇస్తోంది. పైగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమిస్తుండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఉదాహరణకు పాలమూరు జిల్లా బాలానగర్ పీహెచ్సీని 30 పడకల కమ్యూనిటీ హెల్త్సెంటర్గా అప్గ్రేడ్ చేశారు. దీన్ని ఈ ఏడాది జనవరి 18న మంత్రి హరీశ్రావు ఓపెన్ చేశారు. ఇక్కడ ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఆరుగురు నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు.. మొత్తం 16 మంది ఉండాలి. కానీ ఇప్పటికీ ఒక్క డాక్టర్ను కూడా నియమించలేదు. షాద్నగర్ నుంచి ఒక డాక్టర్ను డిప్యూటేషన్ మీద పంపారు. పీహెచ్సీలో గతంలో ఉన్న ఇద్దరు నర్సులే పని చేస్తున్నారు. దీంతో పేషెంట్స్రాక బెడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా కట్టిన వంద పడకల హాస్పిటల్లో బెడ్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. 5 ఎకరాల్లో రూ.35 కోట్ల ఖర్చుతో అన్ని హంగులతో కట్టిన ఈ మూడంతస్తుల దవాఖానాను ఇటీవల ప్రారంభించారు. స్పెషలిస్టు డాక్టర్లు, సరిపోయినంతమంది స్టాఫ్ లేకపోవడంవల్ల రోగులకు సేవలందడంలేదు. ఇక్కడ 40 మంది డాక్టర్లు, వంద మంది నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని నియమించవలసి ఉండగా.. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం డెలివరీలు మాత్రమే చేస్తుండడంతో ఫస్ట్ఫ్లోర్లో వివిధ వార్డుల్లో వేసిన 90 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.