కొడుకును కరిచిందని.. కుక్కను చంపిన తండ్రి

కొడుకును కరిచిందని.. కుక్కను చంపిన తండ్రి

తన కొడుకును కరిచిందని తండ్రి ఓ కుక్క ప్రాణం తీశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఎంపీలోని గ్వాలియర్ జిల్లాలోని సిమారియతాల్ గ్రామంలో సాగర్ విశ్వాస్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క అతని కొడుకును కరిచింది. దీంతో పిల్లాడి దవడపై కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి తండ్రి సాగర్ విశ్వాస్ కుక్కపై దాడికి దిగాడు. వెంటనే ఓ కర్ర తీసుకొని దాన్ని పటా పటా చావబాదాడు. అంతేకాకుండా ఓ పదునైన ఆయుధంతో దాని కాలు కోశాడు. అయితే నెల రోజుల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం రోజు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

వైరల్ అయిన ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు సాగర్ విశ్వాస్ పై మండిపడ్డారు. నోరులేని మూగ జీవాలపై ఇంతలా దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెటా కార్యకర్తలు సాగర్ విశ్వాస్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే సాగర్ విశ్వాస్ కోర్టు ఎదుట హాజరవుతారన్నారు. జంతువుల సంరక్షణ విషయంలో బలమైన చట్టాలు లేనందునే మూగ జీవాలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. అభం శుభం తెలియని జీవాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారంతా కోరుతున్నారు.