మద్రాస్ హైకోర్టు కీలక కామెంట్స్
చెన్నై: బాధితురాలి ఒంటిపై గాయాల గుర్తులు లేనంతమాత్రాన ఆమెపై రేప్ జరగలేదని నిర్ధారించడం కరెక్ట్ కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. గాయాలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్న అంశాల్ని సాకుగా చూపించి నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేడని స్పష్టంచేసింది. 12 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఓ వ్యక్తికి ఈరోడ్ కోర్టు విధించిన 17 ఏండ్ల జైలుశిక్షను హైకోర్టు సమర్థించింది. తమిళనాడులో సంచలనం రేపిన ఈ కేసుపై ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నిందితుడి తరఫు లాయర్ వాదనను జడ్జి జస్టిస్ వైద్యనాథన్ తీవ్రంగా తప్పుపట్టారు.
‘‘బాధితురాలి వయసు10ఏండ్లు. తనపై జరుగుతున్నది లైంగికదాడే అనే విషయం తెలియకపోవడం వల్ల ఆ చిన్నారి రిస్ట్రిక్ట్ చేసి ఉండకపోవచ్చు. కేవలం ఒంటిపై గాయాలు లేవనే సాకును చూపి రేప్ జరగలేదనడం తప్పుడు వాదన. ఒంటిపై గాయాలు లేకున్నా, డ్రెస్పై నిందితుడి వీర్యం ఆనవాళ్లు, ఇతర ఆధారాలు పక్కాగా లభించాయి. ఆమె వాంగ్మూలాన్ని కోర్టు బలంగా నమ్ముతోంది’’అని జడ్జి అన్నారు. ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతుర్ని ప్రకాశ్ అనే యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని 2015లో పోలీసులకు కంప్లయింట్ చేసింది. దొరికిన ఆధారాలను బట్టి నిందితుడికి ఐపీసీ కింద 10 ఏండ్లు, పోక్సో చట్టం కింద మరో ఏడేండ్లు జైలు శిక్ష విధిస్తూ ఈరోడ్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులో బాలిక ఒంటిపై గాయాలు లేవని ఉండటంతో శిక్షను సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టు మెట్లెక్కాడు.