
- నలుగురికి తప్పిన ప్రమాదం
నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో నిలిపి ఉన్న రెస్ట్ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచ్లో నలుగురు ఉద్యోగులు ఉండగా, మంటలను గుర్తించి కంపార్ట్మెంట్ తలుపులు తెరిచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకొని రెస్ట్ కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.