మహానిమజ్జనం ..ఎటు చూసినా కిక్కిరిసిన జనం

మహానిమజ్జనం ..ఎటు చూసినా కిక్కిరిసిన జనం

హైదరాబాద్, వెలుగు : ఎటూ చూసినా కిక్కిరిసిన జనం. క్యూ కట్టి  నిమజ్జనానికి తరలొచ్చిన విగ్రహాలు. ‘గణపతి బప్పా మోరియా’.. జై బోలో గణేశ్ ​మహరాజ్ కీ జై’.. నినాదాలు. బ్యాండ్​ మేళాలు.. డప్పు చప్పుళ్లు.. ఆటలు.. పాటలు.. డ్యాన్స్​లు.. యువత కేరింతలు.. ఇలా ట్యాంక్​బండ్ పరిసరాలు హోరెత్తాయి. 

 

గురువారం హుస్సేన్​సాగర్ నిమజ్జనం చూసేందుకు చిన్నా, పెద్ద.. కుటుంబాలతో ఉత్సాహంగా ట్యాంక్​బండ్​కు తరలివచ్చారు. లంబోదరుడికి బై బై​ చెప్పారు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్​ల మీద.. ఇలా తమ గణనాథులను తీసుకొచ్చి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్​బడా గణేశ్ ​శోభాయాత్ర ప్రారంభమై సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్​, లుంబిని పార్క్, ఎన్టీఆర్​ మార్గ్​కు చేరింది. దీంతో ఆ ఏరియా జనాలు కిక్కిరిసిపోయింది. 

జనం బడా గణేశ్​ను తమ సెల్​ఫోన్లలో ఫొటోలు తీసుకోగా.. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ సందడిచేశారు. సాయంత్రం వాన పడుతున్నా లెక్క చేయకుండా ఎంజాయ్​చేశారు. సిటీ జనాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

నిమజ్జనంలో భాగంగా వెరైటీ గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిపురుష్​ సినిమాలో హనుమంతుడి రూపం, శివ తాండవ గణనాథుడి రూపం, హనుమంతుడు చేతిలో సంజీవని పర్వతరూపం, వసుదేవుడి తలమీద గణనాథుడు, గిటార్​ వాయిస్తున్న గణపతి ఇలా బహు రూపాల్లో ఉండి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచి.. చూపరులకు కనువిందు చేశాయి. అదేవిధంగా నిమజ్జన ట్రెండ్​ మారుతూ వస్తుంది. 

యూత్​అసోషియేషన్లు, ఫ్రెండ్స్​, కాలనీవాసులు, ఇండ్లలో గ్రూప్​గా  విగ్రహాలు పెట్టిన వారు డ్రెస్​కోడ్​లో కనిపించారు. ఇలా డ్రెస్​కోడ్​తో వచ్చిన వారు ట్యాంక్​బండ్​పై ప్రధాన ఆకర్షణగా కనిపించారు.  సాయంత్రం భారీ వర్షం పడటంతో గణనాథుల నిమజ్జనం నెమ్మదిగా సాగింది. సైబరాబాద్ పరిధిలో గణేశ్​ నిమజ్జనాలు కొనసాగాయి. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిమజ్జనాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.

గురువారం 4,474 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఆయన తెలిపారు. కూకట్ పల్లి ఐడీఎల్ చెరువులో 281 విగ్రహాల నిమజ్జనం జరిగింది. సరూర్​నగర్​లోని మినీ ట్యాంక్​బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం కోలాహలంగా సాగింది. భక్తులు భారీగా తరలివచ్చారు.