
ఈ రోజుల్లో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం అనేది చాల కామన్.. ఫ్లై ఓవర్లు, హైవేలు,స్కైవేలతో కనెక్టివిటీ పెరుగుతున్నటువంటి ఈ కాలంలో ఇంకా బస్సు సౌకర్యం లేని గ్రామాలున్నాయంటే నమ్మ శక్యం కావడం లేదు.
అవును స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అయినా ఇంకా మన దేశంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మారుమూల గ్రామం మార్కానార్ కు ఇంత వరకు బస్సు సౌకర్యం లేదు. నక్సలైట్ల మధ్య నలిగిపోతున్న ఆ ఊరికి ఇన్నేళ్లకు బస్సు వచ్చింది. దీంతో ఆ ఊరి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాకరాక తమ ఊరికి బస్సు రావడంతో గ్రామస్థులు పూజలు చేసి సంబరాలు చేసుకున్నారు.
Also Read : ఢిల్లీ,బెంగళూరులో వందల స్కూళ్లకు బాంబు బెదిరింపులు.
గడ్చిరోలి జిల్లాలోని మూరుమూల గ్రామం మార్కానార్ . ఇది నక్సలైట్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న గ్రామం. ఎట్టకేలకు ఇటీవల ఊరికి ఎంఎస్ఆర్టీసీ బస్సు రావడంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. హారతులతో బస్సుకు స్వాగతం పలికారు. పోలీసులు, గ్రామస్థులు బస్సుకు పూజలు చేశారు. జాతీయ జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మార్కానార్ గ్రామం నుంచి ఆహేరి వరకు దాదాపు వెయ్యి మంది ప్రజల రవాణాకు ఈ బస్సు ఉపయోగపడుతోంది.