న్యూఢిల్లీ: మహిళల కోసం తీసుకొచ్చిన డిపాజిట్ స్కీమ్ ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ కింద సుమారు 14.83 లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయని, రూ.8,630 కోట్ల విలువైన డిపాజిట్లు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు మహిళల కోసం ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చని వివరించారు. కనీస డిపాజిట్ అమౌంట్ రూ. వెయ్యి, గరిష్టంగా రూ.2 లక్షలను రెండేళ్ల కాలపరిమితికి గాను డిపాజిట్ చేయొచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కింద ఏడాదికి 7.5 శాతం వడ్డీని ఇస్తున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్, అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఈ స్కీమ్ కింద డిపాజిట్లు సేకరిస్తున్నాయని చౌదరి వివరించారు. 2025 వరకు రెండేళ్ల కాలపరిమితితో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందన్నారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కింద ప్రస్తుత ఆర్థిక సంవ్సరంలోని మొదటి రెండు నెలల్లో రూ.74,937.87 కోట్లు డిపాజిట్ అయ్యాయని అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద మినహాయింపులను పెంచే ఆలోచన లేదని వివరించారు.