- ఇన్వెస్ట్ చేసేందుకు గోల్డ్, డిపాజిట్ల వైపు చూస్తున్న ప్రజలు : మనీ9 సర్వే
న్యూఢిల్లీ : ప్రజలకు బ్యాంక్ డిపాజిట్లు, గోల్డ్ పై మోజు తగ్గడం లేదు. సుమారు 77 శాతం మంది రెస్పాండెంట్లు తమ డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఓ సర్వేలో పేర్కొన్నారు. 21 శాతం మంది మాత్రం గోల్డ్లో పెడతామని అన్నారు. మనీ9 యాన్యువల్ పర్సనల్ ఫైనాన్స్ సర్వే ప్రకారం, ఇన్సూరెన్స్పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. 27 శాతం కంటే ఎక్కువ కుటుంబాలు ఈ ఏడాది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాయి. 2022 సర్వేలో ఈ నెంబర్ 19 శాతంగా నమోదయ్యింది. కానీ 53 శాతం కుటుంబాలకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదని మనీ9 వెల్లడించింది.
20 రాష్ట్రాలలోని 35 వేల మంది కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేశామని తెలిపింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు భారీగా పెరిగారని ఈ సంస్థ పేర్కొంది. కిందటేడాది సర్వేలో 3 శాతం మంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పగా, ఈ ఏడాది చేసిన సర్వేలో 9 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. దీనికి అదనంగా 10 శాతం కుటుంబాలు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడుతున్నాయి. 2022 లో ఈ నెంబర్ కేవలం 6 శాతంగానే రికార్డయ్యింది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లలో సౌత్ ఇండియన్ సిటీలు ముందున్నాయి. గోల్డ్లో డబ్బులు పెట్టిన వారిలో 69 శాతం మంది బెంగళూరు నుంచి, 66 శాతం మంది తిరువనంతపురం నుంచి ఉన్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నవారిలో అయితే 84 శాతం మంది మధురై, 79 శాతం మంది అమరావతి, 76 శాతం మంది ఔరంగాబాద్ నుంచి ఉన్నారని మనీ9 తెలిపింది.