
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తాత్కాలికంగా ఆగినప్పటికీ.. ఇరు దేశాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇరాన్ మళ్లీ అణు ఉత్పత్తి మొదలు పెడితే తప్పకుండా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి చేస్తే ఈ సారి పరిణామాలు వేరేలా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాలని హెచ్చరించిన ట్రంప్.. అంతకు ముందు ఇరాన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఫత్వా జారీ చేయడం సంచలనంగా మారింది.
‘ట్రంప్, నెతన్యాహు దేవుని శత్రువులు’ అని ఇరాన్ మత గురువు గ్రాండ్ అయతుల్లా నాజర్ మకరెమ్ శిరాజి ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాన్ని బెదిరించినందుకు ఆ ఇద్దరు నేతలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు కలిసి గద్దె దించాలని పిలుపునిచ్చారు. మార్జా నేతను బెదిరించే ఎవరైనా దేవుని శత్రువునిగా (మొహరెబ్) పరిగణించాలని ప్రకటించారు.
ఇరానియన్ చట్టం ప్రకారం మొహరెబ్ అంటే అల్లాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవారు. ఇరాన్ చట్టాల ప్రకారం.. అలాంటి వారికి మరణ శిక్ష, అవయవాల ఛేదన, బహిష్కరణ మొదలైన శిక్షలు ఉంటాయి. ప్రస్తుతం ట్రంప్, నెతన్యాహులను మొహరెబ్ గా ప్రకటించడం గమనార్హం.
ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసే వారికి లేదా మద్ధతు ఇచ్చే వారికి ఈ చట్టాలను వర్తింపజేయాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాళ్లు పశ్చాతాపపడేలా చేయాలని ఫత్వా ద్వారా పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ఏదైనా జరిగినా, ప్రాణాలు కోల్పోయినా దేవుడి సేవ కోసం త్యాగం చేసిన వారిలాగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జూన్ 13 నుంచి యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఇరాన్ అణు ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడగా.. ఇరాన్ కూడా అంతే తీవ్రతతో తిప్పి కొట్టింది. ఇరు దేశాల దాడులలో టాప్ కమాండర్లతో పాటు ఆర్మీ జవాన్లు, సాధారణ పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో ఇరాన్ ఫత్వా విడుదల చేయడం గమనార్హం.