న్యూఢిల్లీ: బ్యాంకులే కాదు కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లు- ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకుంటున్నాయి. ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్టులనూ అందిస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. వడ్డీ ఎక్కువ వచ్చే పథకాలను అందిస్తున్నాయి. కేవలం కొన్ని క్లిక్లతో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాట్ఫారమ్లు ఫిక్స్డ్ డిపాజిట్లను అందించడానికి బ్యాంకులతో, నాన్-–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీలు) ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. మనీకంట్రోల్ వంటి మీడియా ప్లాట్ఫారమ్లు కూడా ఈ బిజినెస్లోకి వచ్చాయి. మనీకంట్రోల్ ద్వారా బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టేబుల్ మనీ, ఫిక్స్డ్ ఇన్వెస్ట్ వంటి ప్లాట్ఫారమ్లు ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లను మాత్రమే అందిస్తున్నాయి. వింట్ వెల్త్, ఈటీ మనీతో సహా మరికొన్ని సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు ఇతర పెట్టుబడి ఆప్షన్లను అందిస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లతో కలిగే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే.. వీటిలో పెట్టుబడి పెట్టడం సులభం. బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్సైట్ను సందర్శించడానికి బదులుగా, మీరు ఒకే చోట వివిధ రకాల ఎఫ్డీలను పోల్చవచ్చు. దేనిలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని, కేవైసీ ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత ఎఫ్డీని ఎంచుకోవచ్చు. అన్ని ఎఫ్డీలను ఒకే చోట చూసుకోవచ్చు. అంతే కాకుండా, కొన్ని ప్లాట్ఫారమ్లు సైన్ అప్ చేసినందుకు గిఫ్ట్ వోచర్లు, రిఫరల్ క్యాష్బ్యాక్లు వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఉచితాల కారణంగా మీ పెట్టుబడి నిర్ణయాలను మార్చుకోకండి. అనేక ఆన్లైన్ పెట్టుబడి ప్లాట్ఫారమ్లు మార్కెట్ప్లేస్లుగా పనిచేస్తాయి.
వీటిలో పెట్టుబడిదారులు వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అందించే ఎఫ్డీలను పోల్చవచ్చు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన డబ్బు నేరుగా ఎఫ్డీని జారీ చేసే సంస్థకు వెళుతుంది..ప్లాట్ఫారమ్కు కాదు. దీనివల్ల పెట్టుబడిదారుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ విషయమై స్టేబుల్ మనీ కో–ఫౌండర్ సౌరభ్ జైన్ మాట్లాడుతూ, ప్లాట్ఫారమ్పై పెట్టుబడి పెట్టిన ఏదైనా డబ్బు నేరుగా సంబంధిత బ్యాంక్/ఎన్బీఎఫ్సీకి వెళ్తుందని, ఎఫ్డీ మెచ్యూర్ అయినప్పుడు లేదా కస్టమర్ మధ్యలో ఉపసంహరించుకున్నప్పుడు, డబ్బు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాకు చేరుతుందని వివరించారు. "వింట్ వెల్త్ రిటైల్ పెట్టుబడిదారులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ‘ఏఏఏ’ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీల నుండి ఫిక్స్డ్ డిపాజిట్లను పొందడానికి ప్లాట్ఫారమ్గా మాత్రమే పనిచేస్తుంది. అన్ని డిపాజిట్లు నేరుగా సంబంధిత చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎన్బీఎఫ్సీలకు చేరుకుంటాయి మా వద్ద ఎప్పుడూ ఉండవు” అని సంస్థ కో–ఫౌండర్ అజింక్య కులకర్ణి అన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఫిన్టెక్ సంస్థలతో రిస్క్ చేయకూడదని, ప్రభుత్వ బ్యాంకులనే నమ్మడం మంచిదని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కల్పేష్ అషార్ చెప్పారు. కార్పొరేట్ ఎఫ్డీలలో ఏఏఏ రేటింగ్ కంటే తక్కువ ఉన్న వాటికి జోలికి వెళ్లొద్దని చెప్పారు. ‘‘మధ్యవర్తుల ద్వారా ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుతానికి సౌకర్యంగానే ఉండొచ్చు. రేపు వీళ్లంతా ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి, నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను ” అని కల్పేష్ చెప్పారు.
కవరేజ్ ఉంటుంది..
ఇన్వెస్టర్ ఏ ప్లాట్ఫారమ్ నుంచి పెట్టుబడి పెట్టారనే దానితో సంబంధం లేకుండా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లకు (రూ. 5 లక్షల వరకు) డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కవర్ కిందకు వస్తాయి. అయితే, ఈ రక్షణ ఎన్బీఎఫ్సీలు ఇతర కంపెనీలు అందించే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించదు. అన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ఎంపిక చేసిన సంస్థల నుంచి మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లను అందజేస్తాయి. అన్ని సంస్థల ఎఫ్డీలు ఉండవు. అట్లాంటి సంస్థల డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు వాటిని విడిగా సంప్రదించాలి. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు పెట్టుబడి సౌకర్యాన్ని అందిస్తాయి కానీ మీరు వాళ్ల దగ్గరున్న ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మాత్రమే ఎంచుకోవాలి. మీరు పెద్ద బ్యాంకులతో మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు సరైనవి కాకపోవచ్చు.