CRPF వాహనాల్లో BJP డబ్బులు: మమత

CRPF వాహనాల్లో BJP డబ్బులు: మమత

ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ, సీఆర్పీఎఫ్​ వాహనాల ద్వారా వెస్ట్​ బెంగాల్​కు డబ్బులు తరలిస్తున్నదంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం కోల్​కతాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆమె,  బెంగాల్​ను అవమానించినందుకు అమిత్​షా.. చెవులు పట్టుకుని గుంజీలు తీయాలన్నారు. ‘‘బీజేపీ పార్టీ గల్లీ స్థాయి నేతలకు కూడా కేంద్ర పోలీసుల భద్రత కల్పించారు. వాళ్లంతా సీఆర్పీఎఫ్​ వాహనాల ద్వారా అక్రమంగా డబ్బులు తరలిస్తూ ఓటర్లకు పంచుతున్నారు. కోల్​కతా, విధాన్​నగర్​ పోలీస్​ కమిషనర్లను ఎలక్షన్​ కమిషన్​ బదిలీ చేసిన తర్వాత డబ్బుల ప్రవాహం ఇంకా పెరిగింది.

డబ్బులు పంచిందెవరో, తీసుకున్నదెవరో ఎన్నికల తర్వాత అందరి పని పడతా’’అని మమత చెప్పారు. ‘కంగాళ్​ బెంగాల్’ అంటూ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడినందుకు బీజేపీ చీఫ్​ అమిత్​షా గుంజీలు తీయాలని ఆమె మండిపడ్డారు. ‘‘అసలు కంగాళ్​ అనే పదానికి అర్థం షాకు తెలుసా? ఎంత ధైర్యముంటే ఆయనా మాటంటాడు? బెంగాల్​ని బికారి(కంగాళ్​) అన్నందుకు షా తన రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీయాలె”అని మమత ఫైరయ్యారు. ఆదివారం ఓ సభలో మాట్లాడిన బీజేపీ చీఫ్​ షా.. మమత పాలనలో ‘సోనర్(బంగారు) ​ బెంగాల్​ కాస్తా  కంగాళ్​(బికారి) బెంగాల్​’గా తయారైందని విమర్శించారు. మంగళవారం కోల్​కతా సిటీలో ఆయన నిర్వహించిన రోడ్​షో ఉద్రిక్తతలకు దారితీసింది. ఏడో ఫేజ్​లో భాగంగా వెస్ట్​ బెంగాల్​ లోని 9 లోక్​సభ స్థానాలకు  19న పోలింగ్​ జరుగనుంది.