గుడిహత్నూర్, వెలుగు: పోస్టల్ శాఖలో జాబ్ ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడి వద్ద రూ.లక్ష కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్కు చెందిన బి.స్వప్నిల్కు అదే గ్రామానికి చెందిన ఫడ్రాజు అనే వ్యక్తి పోస్టల్ శాఖలో జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు.
దీంతో బాధితుడు 2018లో తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షను రాజుకు బదిలీ చేశాడు. ఉద్యోగం గురించి అడిగితే రేపుమాపు అంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో బాధితుడు గుడిహత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫడ్రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, అధికారిక నోటిఫికేషన్ల ద్వారానే జాబ్ ప్రయత్నాలను చేయాలని ఏఎస్పీ సూచించారు.
