కోల్ కతా: ముందు పాజిటివ్ వచ్చింది.. ఆ తర్వాత నెగెటివ్.. రిపోర్ట్ సరిగ్గా చెక్ చేస్తే పాజిటివ్.. అప్పటికే టైం మించి పోయింది. ఆస్పత్రి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. టెస్టు రిజల్ట్స్ లో తేడాలుండడంతో సరైన ట్రీట్ మెంట్ అందక ఓం ప్రకాశ్ (68) అనే వ్యక్తి చనిపోయారు. అతడికి కరోనా లక్షణాలుండగా పోయిన వారం స్థానిక కరోనా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు పాజిటివ్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్న స్టాఫ్.. అతడి కుటుంబాన్ని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
నాలుగు రోజుల తర్వాత ఆయన కొడుకు రాజ్ గుప్తాకు ఫోన్ చేసిన హాస్పిటల్ సిబ్బంది ఓం ప్రకాశ్ కు నెగెటివ్ వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాతి రోజు సాయంత్రం మళ్లీ ఫోన్ చేసి.. కరోనా టెస్టు రిజల్ట్స్ లో తప్పు జరిగిందని, ఓం ప్రకాశ్ కు పాజిటివ్ ఉందని, వెంటనే హాస్పిటల్కు తీసుకురావాలని అతడి కొడుకు రాజ్ గుప్తాకు హాస్పిటలోళ్లు ఫోన్ చేశారు. అడ్మిట్ చేయగా ట్రీట్ మెంట్ పొందుతూ మరణించాడు.