
- రెండేండ్లవుతున్న ఇంకా పరిశీలన దశలోనే
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భవన నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. అనుమతులు వచ్చి రెండేండ్లు అవుతున్నా స్థల సేకరణ కొలిక్కి రావడం లేదు. దీంతో మార్కెట్ యార్డు గోదాముల్లో కాలేజీ నడుస్తోంది. ఎంసీఐ రూల్స్ ప్రకారం కాలేజీ ప్రారంభించిన ఏడాదిలోగా పక్కా భవనాలు నిర్మించాలి. లేకుంటే పర్మిషన్ క్యాన్సల్ అవుతుందని స్పష్టం చేసినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు అనువైన ప్రభుత్వ భూముల కోసం వెతుకుతున్నారు. ఫైనల్గా గుడిపేటలోని ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చారు. ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే రియల్ బిజినెస్కు అనుకూలంగా ఉన్న స్థలాలను కేటాయించాలని రియల్టర్లు లాబీయింగ్ చేయడం వల్ల ఎటూ తేల్చలేకపోతున్నట్టు తెలుస్తోంది.
పరిశీలనలు– తిరష్కరణలు
మెడికల్ కాలేజీ కోసం మొదట గోదావరి పక్కనున్న 207, 208 సర్వేనంబర్లలోని భూదాన్ బోర్డు భూముల్లో 22 ఎకరాలను కేటాయించారు. ఇక్కడే నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి నిరుడు మార్చి 5న హెల్త్ మినిస్టర్ హరీశ్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అక్కడ రూ.18 కోట్లతో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) నిర్మించారు. జూలైలో వచ్చిన వరదల్లో అది నీటమునిగింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి. భవిష్యత్లోనూ ముంపు పొంచి ఉండడంతో ఎంసీహెచ్ను వేరే చోటికి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరో మూడు చోట్ల ప్రతిపాదనలు చేశారు. నస్పూర్లోని 669 సర్వేనంబర్లో సింగరేణికి చెందిన 45 ఎకరాలను పరిశీలించారు. దానికి దగ్గరలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీపీ) ఉండడంతో మెడికల్ బోర్డ్ తిరస్కరించింది. అంతకుముందు ఇందారం శివారులో అనుకున్నప్పటికీ జిల్లా కేంద్రానికి దూరమవుతుందని విరమించుకున్నారు. తర్వాత మంచిర్యాలలోని సాయికుంట శివారులో 662, 672 సర్వేనంబర్లలోని 14 ఎకరాలను ప్రతిపాదించారు. ఈ స్థలాన్ని మెడికల్ కాలేజీకి కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఇది కూడా ముంపు ప్రాంతం, లూజ్ సాయిల్ కావడం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వంటి కారణాల చూపుతూ మెడికల్ బోర్డ్ నో చెప్పింది.
గుడిపేటలో అనుకూలమైనా...
తాజాగా గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ సమీపంలోని 294, 300 సర్వేనంబర్లలోని 40 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ను మెడికల్ కాలేజీకి ప్రతిపాదించారు. మూడ్రోజుల కిందట మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి ఈ స్థలాన్ని పరిశీలించారు. మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు అవసరం కాగా, ఇక్కడ 40 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. భవిష్యత్లో మెడికల్ కాలేజీ విస్తరణకు మిగులు భూమి ఉంటుందనే అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందనే కారణంతో హోల్డ్లో పెట్టినట్టు సమాచారం. 5 కిలోమీటర్ల పరిధిలో మరో స్థలాన్ని గుర్తించాలని జిల్లా అధికారులకు సూచించినట్టు తెలిసింది. కానీ ఆ పరిధిలో ఒకే చోట 25 ఎకరాల భూమి అందుబాటులో లేదు. ఉన్న భూములన్నీ కబ్జాలపాలు కావడంతో మెడికల్ కాలేజీకి స్థలం దొరకని పరిస్థితి ఎదురైంది.
రియల్టర్ల లాబీయింగ్...
సాయికుంట శివారులో పలువురు రూలింగ్ పార్టీ లీడర్లు, రియల్టర్లకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. గోదావరి వరద ముంపు ప్రాంతం కావడంతో అక్కడ భూమి రేటు తక్కువ ఉంది. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కడితే తమ భూములకు డిమాండ్ వస్తుందని, రేట్లు రెండింతలు పెరుగుతాయని, తద్వారా కోట్లలో లాభపడవచ్చని భావించారు. ప్రజాప్రతినిధులను ఒప్పించి సాయికుంట శివారులోని 14 ఎకరాల మున్సిపల్ స్థలాన్ని కేటాయించేలా పావులు కదిపారు. ఈ స్థలాన్ని మెడికల్ కాలేజీకి కేటాయిస్తూ ఆగమేఘాల మీద మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. కానీ దీనికి మెడికల్ బోర్డ్ నో చెప్పింది. గుడిపేటలోని భూమి జిల్లా కేంద్రానికి దూరమవుతుందనే కారణంతో మళ్లీ వేరే స్థలాన్ని సేకరించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో మళ్లీ అదే సాయికుంటలోని మున్సిపల్ స్థలాన్ని కేటాయించేలా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.