హత్యలకు సుపారీగా రూ.30 లక్షల భూమి

హత్యలకు సుపారీగా రూ.30 లక్షల భూమి
  • ప్రియుడి సహకారంతో చంపించిన శాంతయ్య భార్య సృజన 
  • 4 నెలల కిందే ప్లాన్.. గతంలో ఓసారి చంపేందుకు ప్రయత్నం
  • పోలీసుల అదుపులో సృజన, ఆమె ప్రియుడు సహా నలుగురు  

మందమర్రి, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవ దహనం ఘటన.. ప్లాన్డ్​ మర్డర్​ అని తెలుస్తోంది. సింగరేణి కార్మికుడు శనిగారపు శాంతయ్య భార్య సృజన.. తన ప్రియుడు లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్​ సాయంతో హత్యలు చేయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకున్న సృజ న.. ఆయన ఆస్తులన్నీ రాజ్యలక్ష్మికే దక్కుతాయని, భవిష్యత్తులో తన కొడుకులకు వారసత్వ ఉద్యోగం కూడా రాదన్న భయంతో హత్యలు చేయించినట్లు సమాచారం. సృజన, లక్ష్మణ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. ఆదివారం సీన్​రీకన్ స్ట్రక్షన్ కు ప్రయత్నించిన ప్పటికీ, చివరి నిమిషంలో ఆపారు. ఈ కేసుకు సంబంధించి కొంతమందిని విచారిస్తున్నామని, సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ చెప్పారు. 

కుటుంబంలో గొడవలు..

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లికి చెందిన మాసు శివయ్య, రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ దంపతులు. శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే-5బీ బొగ్గు గనిలో మైనింగ్ సర్దార్​గా పని చేస్తున్న శాంతయ్యకు వీళ్లతో కొన్నేండ్ల కింద పరిచయం ఏర్ప డింది. శాంతయ్య తన కుటుంబాన్ని వదిలేసి రాజ్యలక్ష్మితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కింద ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుల్లో దాదాపు రూ.15 లక్షలు రాజ్యలక్ష్మికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. నెల కింద శ్రీరాంపూర్ పీఎస్​​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

ఆటోలో పెట్రోల్ తీసుకొచ్చి...

శాంతయ్య దూరం కావడంతో లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరుకు చెందిన మేడి లక్ష్మణ్ కు సృజన దగ్గరైనట్లు తెలిసింది. శాంతయ్య, రాజ్యలక్ష్మిని ఎలాగైనా హత్య చేయాలని భావించిన సృజన.. ఇందుకు లక్ష్మణ్​సాయం కోరిందని, ఉత్కూరులో ఉన్న రూ.30 లక్షల విలువైన భూమి సుపారీగా ఇచ్చేందుకు 4 నెలల ఒప్పందం చేసుకుందని, హత్యల కోసం లక్ష్మణ్ తన దోస్తులైన రమేశ్, సమ్మయ్య సాయం తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. నెల కింద ఈ ముగ్గురూ శాంతయ్యను కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేయగా, ఆయన వారి నుంచి తప్పించుకున్నాడు. కొన్ని రోజులుగా డ్యూటీకి వెళ్లకుండా గుడిపెల్లిలోని రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నాడు. శుక్రవారం ఇద్దరూ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న లక్ష్మణ్..  రమేశ్​తో కలిసి నస్పూర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో రాత్రి 9 గంటల టైమ్ లో 40 లీటర్ల  పెట్రోల్ కొన్నాడు. ఆయన ఆటోలో వచ్చి  పెట్రోల్ తీసుకెళ్తున్న దృశ్యాలు పెట్రోల్ బంక్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాళ్లు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రాజ్యలక్ష్మి ఇంటికి బయట నుంచి గడియపెట్టి నిప్పు పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇల్లంతా కాలిపోయి శాంతయ్య, రాజ్యలక్ష్మి సహా ఆమె భర్త శివయ్య, అక్క కూతురు మౌనిక, ఆమె ఇద్దరు బిడ్డలు చనిపోయారు.