మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న జవాను ఫొటో రిలీజ్

మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న జవాను ఫొటో రిలీజ్

ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో జరిగిన దాడి తర్వాత మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న జవాను రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. గుడిసెలో రాకేశ్వర్ సింగ్ కూర్చుని ఉన్న ఫొటోను రిలీజ్ చేశారు మావోలు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ ను వదిలేస్తామని నిన్న(మంగళవారం) స్పష్టం చేశారు. చర్చలు జరగనంత వరకూ రాకేశ్వర్ సింగ్.. తమ దగ్గర సురక్షితంగా బందీగా ఉంటాడని లేఖలో తెలిపారు. తమ కండీషన్లకు అంగీకరించేంత విడుదల చేయడం కుదరదంటూ స్పష్టం చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లాలో ఈ నెల 3వ తేదీ రాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 23 మంది జవాన్లు మృతి చెందారు. అయితే ఎన్ కౌంటర్ లో కోబ్రా యూనిట్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ అనే కమాండర్ కూడా కన్పించలేదు. ఆ జవాను తమ ఆధీనంలో ఉన్నట్లు మావోలు ప్రకటించారు.

మరోవైపు రాకేశ్వర్ విడుదలపై ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోడం లేదంటూ ఆయన కుటుంబం ఆరోపించింది.