జాతీయ ఉత్తమ టీచర్గా మారం పవిత్ర..ఐసీటీ మోడ్ లో విద్యార్థులకు పాఠాలు

జాతీయ ఉత్తమ టీచర్గా మారం పవిత్ర..ఐసీటీ మోడ్ లో విద్యార్థులకు పాఠాలు
  • జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్టూడెంట్లతో సైన్స్​ ప్రదర్శనలు
  • సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​ జడ్పీహెచ్​ఎస్​లో విధులు

నల్గొండ, వెలుగు: సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​ జడ్పీహెచ్ఎస్​లో పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ స్థాయిలో బెస్ట్​ టీచర్​గా ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా ఎంపికైన 45 మంది టీచర్లలో తెలంగాణ నుంచి ఆమె ఒక్కరికే అవార్డు దక్కింది. సరికొత్త పద్ధతుల్లో.. స్టూడెంట్లకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన అందించడం వల్లే జాతీయ స్థాయిలో ఆమెకు ఉత్తమ్​ టీచర్ ​అవార్డ్​లభించింది. 

పవిత్ర మాట్లాడుతూ.. బయోసైన్స్ బోధించే తనకు సైన్స్​లో కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఆసక్తి ఉండేదని, అందులో భాగంగానే విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించినట్టు చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు వారి ప్రయోగాలను ప్రాజెక్టుల రూపంలో సైన్స్​ఫేర్, ఇన్​స్పైర్, నేషనల్​ చిల్డ్రన్స్​ సైన్స్​ కాంగ్రెస్​లో ప్రదర్శించినట్టు చెప్పారు. చాలామంది విద్యార్థుల ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. 

ఎనిమిదేండ్లకు పైగా గడ్డిపల్లి హైస్కూల్​లో పనిచేసిన పవిత్ర.. గతేడాది పెన్​పహాడ్​కు బదిలీ అయ్యారు. ఆమె మార్గదర్శకత్వంలో గడ్డిపల్లి, పెన్​పహాడ్​ స్టూడెంట్లు​ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్​ ఎగ్జిబిట్స్​ ప్రదర్శించారు. గడ్డిపల్లి విద్యార్థులు ఐఐటీ ఢిల్లీలో ప్రదర్శనలిచ్చారు.2021లో ఎన్​సీటీఎస్​ నిర్వహించిన సైన్స్​ ప్రోగాంలో ఆమెకు ‘సారాభాయ్​ టీచర్​ సైంటిస్ట్ నేషనల్​ అవార్డు’ దక్కింది. 

ఐసీటీ మోడ్​తో టీచింగ్​ సులభం..

ఇంటిగ్రేషన్​ఆఫ్​ఇన్​ఫర్మేషన్​ అండ్​ కమ్యూనికేషన్​ టెక్నాలజీ (ఐసీటీ) మోడ్​లో పిలల్లకు పాఠాలు చెప్తున్నట్టు పవిత్ర చెప్పారు. ఈ పద్ధతిలో కఠినమైన పాఠ్యాంశాలు, కాన్సెప్ట్స్ ​విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయన్నారు. కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఇంటర్నెట్​ను వాడటం వల్ల పిల్లలు సులువుగా పాఠాలు నేర్చుకుంటారని, చదువుపై ఆసక్తి లేని వారు కూడా క్లాస్​రూమ్​లో పెద్ద స్క్రీన్​లపైన బయాలజీ పాఠాలు నేర్చుకుంటారన్నారు. 

బయాలజీకి సంబంధించిన కార్డు గేమ్స్, బోర్డుగేమ్స్​ కూడా తయారు చేయించినట్టు చెప్పారు. దీనివల్ల తనకు 2022లో జిల్లా బెస్ట్​ టీచర్​ అవార్డు, 2023లో స్టేట్ ​బెస్ట్​ టీచర్​ అవార్డు దక్కిందని, ఇప్పుడు జాతీయ స్థాయిలో బెస్ట్​ టీచర్​ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు పవిత్రను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, డీఈవో అశోక్ అభినందించారు. వచ్చే నెల 5న ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోనున్నారు.