
- సెన్సెక్స్ 320 పాయింట్లు జంప్
- 93 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
న్యూఢిల్లీ:
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో సూచీలు ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లకు పైగా లాభపడి 83,000 స్థాయిని అధిగమించింది. ఇది 0.39 శాతం పెరిగి 83,013.96 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో 83,141.21 పాయింట్లకు చేరుకుంది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.35 పాయింట్లు.. అంటే 0.37 శాతం ఎగబాకి 25,423.60 వద్ద ముగిసింది.
ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు లాభపడగా, రియల్టీ, ఎనర్జీ స్టాక్స్ నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ కంపెనీల్లో, జొమాటోకు చెందిన ఎటర్నల్ అత్యధికంగా 2.96 శాతం లాభపడింది. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక శాతానికిపైగా పెరిగాయి. టాటా మోటార్స్ 1.13 శాతం నష్టంతో బిగ్గెస్ట్ లూజర్గా నిలిచింది.
టెంట్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ కూడా పతనమయ్యాయి. సెక్టోరల్ ఇండెక్స్లలో హెల్త్కేర్ 0.87 శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 0.84 శాతం, ఐటీ 0.81 శాతం లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం రూ.1,124.54 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్ 1 శాతానికి పైగా లాభపడగా, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
నిఫ్టీ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా..?
యూఎస్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు నవంబర్ లోపు ఇండియా-యూఎస్ టారిఫ్స్ పై స్పష్టత వస్తుందనే ఊహాగానాలు మార్కెట్లకు ఊతం ఇస్తు్న్నాయి. మరోవైపు ఇరాన్ పోర్ట్ నుంచి వాణిజ్య కార్యకలాపాల విషయంలో భారత్ పై సాంక్షన్స్ ను ఎత్తివేసే అవకాశం ఉందనే సమచారం కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చే అంశం. దీంతో మార్కెట్ల నెక్స్ట్ టార్గెట్ 25,800 గా భావిస్తున్నారు. టారిఫ్స్ విషయంలో అనుకూల నిర్ణయం లేకపోతే మళ్లీ డౌన్ ఫాల్ తప్పదని.. 25000 కు రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అనలిస్టులు చెబుతున్నారు.