సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, పెళ్లింట విషాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, పెళ్లింట విషాదం

సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లింట పెను విషాదం నింపింది. ఆందోల్ మండలం మాన్సాన్ పల్లిలో పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కారణంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది మెదక్ జిల్లా పాపన్న పేటలోని పెళ్ళికొడుకు తాత పెంటయ్య ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి వేడుకతో కలకలలాడాల్సిన ఇరు వర్గాల ఇళ్లలో ఈ యాక్సిడెంట్ తీవ్ర విషాదం మిగిల్చింది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎస్సై హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం కారణంగా పెళ్లి ఆగిపోవటం ఈ కుటుంబాన్ని మరింత కలిచి వేసింది.