- 10 లక్షల యూనిట్లు దాటుతాయంటున్న మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: రానున్న ఫెస్టివ్ సీజన్లో సుమారు 10 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, బస్సులు వంటివి) అమ్ముడవుతాయని మారుతి సుజుకీ అంచనావేస్తోంది. ముఖ్యంగా యుటిలిటీ వెహికల్స్కు డిమాండ్ బాగా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది పండుగ సీజన్ ఆగస్టు 17– నవంబర్ 14 మధ్య ఉంది. మొత్తం ఏడాదిలో జరిగే సేల్స్లో ఫెస్టివ్ సీజన్ సేల్స్ 22 నుంచి 26 శాతం వరకు ఉంటాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల వెహికల్స్ అమ్ముడవుతాయని అంచనా. పండుగ సీజన్లోనే పది లక్షల యూనిట్లు సేల్ అవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది వెహికల్ సేల్స్ బాగున్నాయని, ఇదే మూమెంటం కొనసాగుతుందని అన్నారు. సేల్స్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్, జులైలో మంచి పనితీరు కనబరిచామని, జులైలో అయితే 3.52 లక్షల యూనిట్లు అమ్మామని శశాంక్ పేర్కొన్నారు. ఇది తమకు సెకెండ్ హయ్యెస్ట్ మంత్లీ సేల్స్ అని అన్నారు. ఆగస్టులో కూడా సేల్స్ ఇదే రేంజ్లో ఉంటాయని అంచనావేశారు. డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని, ఆగస్టు, సెప్టెంబర్ లో వర్షాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎక్కువ మంది లోన్లను తీసుకొని కార్లను కొంటున్నారని, సుమారు 83 శాతం మంది కన్జూమర్లు ఈ దారిని ఎంచుకుంటున్నారని శశాంక్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కొత్తగా లాంచ్ చేసిన మోడల్స్ పండుగ సీజన్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో 43 శాతం వాటాతో మారుతి సుజుకీ టాప్లో పొజిషన్లో కొనసాగుతోంది.