న్యూఢిల్లీ: మరోసారి కార్ల రేట్లు పెంచుతూ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ కంపెనీ తయారు చేస్తున్న వివిధ మోడల్స్ కార్ల ధరలు పెంతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచే (సోమవారం) అమల్లోకి రానున్నాయని పేర్కొంది. తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దేశమంతా కార్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని షోరూంలలో సెలెక్టెడ్ మోడల్స్పై పాత ధరల కంటే 1.9 శాతం పెంచినట్లు వెల్లడించింది. మారుతీ సుజుకీ తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లపై మరింత భారం పడనుంది.
2021 క్యాలెండర్ ఇయర్లో జనవరి, ఏప్రిల్, జులై నెలల్లో హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్, సీఎన్జీ మోడల్స్ ధరలను మాత్రమే పెంచింది. ఈ సారి అన్ని మోడల్స్కు ధరల పెంపును వర్తింప జేసింది. హ్యాచ్ బ్యాక్ ఆల్టో, ఎస్ క్రాస్లోని వివిధ మోడల్స్ ధరలు(ఢిల్లీ షోరూంలలో) రూ.2.99లక్షల నుంచి రూ.12.39 లక్షల వరకు ఉండనున్నాయి. ఇలా మారుతీ కంపెనీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు కార్ల ధరలు పెంచింది.