
రైలు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా..
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్యాసింజర్ల భద్రత కోసం సరికొత్త ఆపరేషన్ షురువైంది. రైలు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా.. మొత్తం జర్నీ అంతటా మహిళలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా రైల్వే శాఖ ఆపరేషన్ ‘మేరీ సహేలి (నా ఫ్రెండ్)’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మహిళా సిబ్బంది ప్లాట్ ఫాంలు, సంబంధిత రైళ్లలో డ్యూటీ చేస్తూ.. మహిళలకు అండగా నిలుస్తారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. దీనిపై మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ ప్రాజెక్టును తాజాగా అన్ని రైల్వే జోన్లకు విస్తరించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఆపరేషన్ ‘సహేలి’ ఇలా..
రైలు ఎక్కిన స్టేషన్ లో మహిళా ప్యాసింజర్లు.. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలతో ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది ఇంటరాక్ట్ అవుతారు. జర్నీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ పై వారికి అవగాహన కల్పిస్తారు. వారి సీట్ నెంబర్లను తీసుకుంటారు. రైలులో ఏదైనా సమస్య వస్తే వెంటనే 182 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచిస్తారు. ఈ ఫోన్ కాల్స్ ను సీనియర్ ఆఫీసర్లు రిసీవ్ చేసుకుంటారు. ఆయా స్టేషన్లలో మహిళా ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న సీట్లు, బెర్త్ లు, వారు దిగాల్సిన స్టాపుల ప్రకారం అక్కడి సిబ్బంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవసరమైతే ప్యాసింజర్లతో మాట్లాడతారు.
For More News..