భారీగా పెరిగిన పండగ అమ్మకాలు​

భారీగా పెరిగిన పండగ అమ్మకాలు​

ఆకట్టుకుంటున్న ఆఫర్లు.. ఈఎంఐలతో ఈజీగా బుకింగ్ 

సేల్స్‌ పెరగకపోతే కరోనా నష్టాలను తట్టుకోవడం కష్టం -కన్జూమర్‌‌ డ్యూరబుల్‌ కంపెనీల అంచనా

అమ్మకాలు ఇంకా పెరిగే ఛాన్స్

న్యూఢిల్లీ: వాషింగ్‌‌ మెషీన్లు, ఫ్రిజ్‌‌లు, ఏసీలు, వెహికల్స్‌‌, ఫర్నిచర్‌‌ వంటివి అమ్మే కన్జూమర్‌‌ డ్యూరబుల్‌‌ కంపెనీలు పండగలపై పెట్టుకున్న ఆశలు వమ్ముకాలేదు. ప్రస్తుతం అమ్మకాలు బాగానే ఉన్నాయని, గత ఏడాది ఫెస్టివ్‌‌ సీజన్‌‌తో పోలిస్తే ఈసారి అమ్మకాలు 15 శాతం పెరుగుతాయని అంచనా వేశాయి. కరోనా రిస్ట్రిక్షన్లు ఎత్తివేసినప్పటి నుంచి కన్జూమర్‌‌ డ్యూరబుల్‌‌ మార్కెట్‌‌ పుంజుకుంది. ఎక్కువ మంది ఇంటి నుంచే పని చేయాల్సి రావడం, నౌకర్లు దొరక్కపోవడంతో డిష్‌‌వాషర్లు, మైక్రోవేవ్‌‌ ఓవెన్‌‌ వంటి మరిన్ని వస్తువులు కొనాల్సి వస్తోంది. అందుకే గత కొన్ని నెలలుగా వాషింగ్‌‌ మెషీన్లకు, డిష్‌‌ వాషర్లకు, మైక్రోవేవ్‌‌లకు డిమాండ్‌‌ భారీగా పెరిగింది. ఫ్రిజ్‌‌లకు డిమాండ్‌‌ 10 శాతం పెరిగింది. ఒకప్పుడు డిష్‌‌ వాషర్‌‌ను ఎక్కువగా సంపన్న కుటుంబాలే కొనేవి. ఇప్పుడు అన్ని వర్గాల వాళ్లు వీటిని కొంటున్నారు. దీంతో ఇతర కంపెనీలు కూడా వీటిని అమ్మడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

కొత్త లాంచ్‌‌లూ పెరిగాయ్‌‌…

ఉషా ఇంటర్నేషనల్ ఇటీవల ఫుడ్‌‌ ప్రాసెసర్స్‌‌, ఓవెన్‌‌ టోస్టర్‌‌ గ్రిల్లర్స్‌‌, కుక్‌‌ టాప్స్‌‌, హీటర్స్‌‌ కొత్త మోడల్స్‌‌ను లాంచ్‌‌ చేసింది. జనం దగ్గర ఎక్కువ డబ్బు లేదు కాబట్టి బడ్జెట్‌‌ ధరలనే ప్రకటించింది. షోరూమ్స్‌‌లో ఎక్కువ మోడల్స్‌‌ను ప్రదర్శిస్తోంది. ‘‘కస్టమర్లు షాపుల్లో ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే డిస్‌‌ప్లే ఏరియాను పెంచుతున్నాం’’ అని సౌరభ్‌‌ వివరించారు. శామ్‌‌సంగ్‌‌, సోనీ, ఎల్జీ వంటి కంపెనీలు కూడా కొత్త ప్రొడక్టులను లాంచ్‌‌ చేశాయి.  చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లపై ఫోకస్‌‌ చేశాయి. ఈ విషయమై అజంతా–ఓర్పాట్‌‌ గ్రూప్‌‌ డైరెక్టర్‌‌ నీవిల్‌‌ పటేల్‌‌ మాట్లాడుతూ ‘‘ కరోనా వల్ల ఫారిన్​ నుంచి ప్రొడక్టులు రావడం లేదు. దీంతో అవి డిమాండ్‌‌కు సరిపడా సరుకును అందివ్వలేకపోతున్నాయి. మావంటి లోకల్‌‌ కంపెనీలకు ఇలాంటి సమస్య లేదు. అందుకే చిన్న పట్టణాల్లో మా మార్కెట్‌‌షేర్‌‌ మరింత పెరిగింది’’ అని ఆయన వివరించారు.

కష్టాలూ ఉన్నాయ్​…

ఇప్పుడు అమ్మకాలు బాగానే ఉన్నా, అయినప్పటికీ ఇవేమీ ఫుల్‌‌ ఖుషీగా ఏమీ లేవు. కరోనా నష్టాలను తట్టుకోవాలంటే ఇప్పుడున్న జోరు జనవరి తర్వాత కూడా కొనసాగాలని అంటున్నాయి. లేకపోతే గత నష్టాలను పూడ్చుకోవడం సాధ్యం కాదని చెబుతున్నాయి. ఇండియాలో కరోనా రాక ముందే ఎకానమీ నెమ్మదించడం మొదలయింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం నుంచే కన్జూమర్‌‌ డ్యూరబుల్‌‌ కంపెనీలకు ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో చాలా కంపెనీలు తక్కువ రేట్ల ప్రొడక్టులపై ఫోకస్‌‌ చేశాయి. టీవీలు, ఫ్రిజ్‌‌లు, వాషింగ్‌‌ మెషీన్లను బడ్జెట్‌‌ రేట్లలో తీసుకొచ్చాయి. కస్టమర్లను మరింత ఆకర్షించడానికి నో కాస్ట్‌‌ ఈఎంఐలు, క్యాష్‌‌ బ్యాక్‌‌లను ప్రకటించాయి. ‘‘గత ఏడాది కస్టమర్లు వస్తువు ధరను తగ్గించాలని అడిగారు. ఈసారి సేవింగ్స్‌‌ ముఖ్యమని భావిస్తున్నారు. తేలిగ్గా కిస్తీలు కట్టేలా ఈఎంఐ స్కీమ్‌‌లు ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కువ నెలలతో ఈఎంఐ ఆఫర్‌‌ చేస్తే చాలా మంది కన్జూమర్‌‌ డ్యూరబుల్స్‌‌ను కొంటున్నారు’’ అని కమల్ వివరించారు.

డిమాండ్ ఇంకా పెరగాలి…

ప్రస్తుతం అమ్మకాలు బాగానే ఉన్నా, ఇవి మరింత పెరిగితే గానీ కరోనా నష్టాలను తట్టుకోవడం కంపెనీలకు సాధ్యం కాదు.  లాక్‌‌డౌన్‌‌ వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి జూన్‌‌ వరకు వీటి అమ్మకాలు సున్నాయే! ‘‘గత సెప్టెంబరుతో పోలిస్తే ఈసారి సెప్టెంబరులో కన్జూమర్‌‌ డ్యూరబుల్స్‌‌ అమ్మకాలు సింగిల్‌‌ డిజిట్‌‌ మేర పెరిగాయి. కరోనా సమయంలో వచ్చిన నష్టాలను తట్టుకోవాలంటే రాబోయే క్వార్టర్‌‌లోనూ గిరాకీ భారీగా ఉండాలి’’ అని ఇంటర్నేషనల్‌ సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ సౌరభ్‌‌ అన్నారు. కరోనా వల్ల చాలా మంది షాపింగ్‌‌ను వాయిదా వేసుకున్నారని, జనవరి నుంచి అమ్మకాలు మరింత బాగుంటాయని అనుకుంటున్నామని గోద్రెజ్‌‌  బిజినెస్‌‌ హెడ్‌‌ కమల్‌‌ నంది అన్నారు.