
ములుగు, వెలుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు బుధవారం ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్న కోమటిపల్లి ఆర్పీసీకి చెందిన ఐదురుగు సభ్యులు మడావి భీమా, మడావి కోస, మడివి భీమా, వంజం ఊర, వంజం హుంగి ఉన్నారని తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పోలీసులు అజ్ఞాతంలోని మావోయిస్టులు లొంగిపోవడం కోసం ‘పోరు కన్నా ఊరు మిన్న– మన ఊరికి తిరిగి రండి’ వంటి ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు రివార్డు సొమ్మును 24 గంటలలోపు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నామన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనంలోకి వచ్చి కుటుంబాలతో కలిసి ఉండాలన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున తక్షణ సాయం కింద ఎస్పీ శబరీష్ అందజేశారు.