న్యూఢిల్లీ: మేదాంత పేరుతో ఆసుపత్రులను నిర్వహించే నిర్వహించే గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ వచ్చే నెల మూడున మొదలవుతుంది. కంపెనీ అందించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నవంబర్ 7న ముగుస్తుంది. ఇష్యూ సైజు దాదాపు రూ. 2,200 కోట్లు. ఐపీఓలో రూ. 500 కోట్లకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 5.08 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఓఎఫ్ఎస్లో భాగంగా, ప్రైవేట్ ఈక్విటీ మేజర్ కార్లైల్ గ్రూప్కు అనుబంధంగా ఉన్న అనంత్ ఇన్వెస్ట్మెంట్స్, సునీల్ సచ్దేవా (సుమన్ సచ్దేవాతో కలిసి) ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ప్రస్తుతం గ్లోబల్ హెల్త్లో అనంత్ ఇన్వెస్ట్మెంట్స్కు 25.64 శాతం వాటా ఉండగా, సచ్దేవాకు 13.41 శాతం వాటా ఉంది. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పులు చెల్లించడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ప్రముఖ కార్డియోవాస్కులర్ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన నరేష్ ట్రెహాన్ స్థాపించిన గ్లోబల్ హెల్త్ భారతదేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ప్రైవేట్ మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తోంది. గ్లోబల్ హెల్త్లో కార్లైల్ గ్రూప్ టెమాసెక్ వంటి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. గురుగ్రామ్, ఇండోర్, రాంచీ, లక్నో పాట్నాలలో 'మేదాంత' బ్రాండ్ క్రింద ఐదు ఆసుపత్రుల నెట్వర్క్ను నిర్వహిస్తోంది. నోయిడాలో మరో ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో నోయిడా ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత, కంపెనీ మొత్తం 3,500 బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. మెడికల్ టూరిజంపై కూడా పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్హెల్త్ మొత్తం ఆదాయం రూ.2,205.8 కోట్లు కాగా లాభం రూ.196.2 కోట్లుగా ఉంది. క్రిసిల్ రిపోర్టు ప్రకారం, ఇండియా హెల్త్కేర్ 2016–21 మధ్య 13–-15 శాతం సీఏజీఆర్ సాధించింది. ఇదిలా ఉంటే, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, క్రెడిట్ సూయిజ్ , జెఫరీస్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు.