తాడ్వాయి, వెలుగు : మేడారంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం అభివృద్ధి పనులపై హరిత హోటల్లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మేడారం జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో భద్రత, పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాశ్వత నిర్వహణ వ్యవస్థ ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.
గోదావరి పుష్కరాల సమయంలో మేడారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. 30 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ చేయాలని ఆదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితులను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, గ్రామాల్లోని కుంటలు, చెరువులు, కరకట్టల పరిస్థితిని అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్వో వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, అడిషనల్ కలెక్టర్లు సీహెచ్. మహేందర్, సంపత్ రావు పాల్గొన్నారు.
