- మెక్సికో టారిఫ్ల పెంపు..
- ఆటో, మెటల్స్ కంపెనీలకు కష్టాలే!
- ఈ దేశానికి జరిపే ఎగుమతుల్లో మూడో వంతు ఆటో సెక్టార్ నుంచే..
- భారత వస్తువులపై సగటు
- టారిఫ్ రేటు 30–35 శాతం
- గతంలో వేసిన 12–15 శాతంతో పోలిస్తే రెండున్నర రెట్ల పెరుగుదల
న్యూఢిల్లీ: మెక్సికో టారిఫ్లు పెంచడంతో భారత ఆటో, ఆటో పార్టులు, మెటల్, ఎలక్ట్రానిక్స్ వంటి సెక్టార్లు నష్టపోనున్నాయి. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాకపోయినప్పటికీ మెక్సికోతో వాణిజ్య మిగులు ఉంది. ఈ దేశం నుంచి జరుపుకుంటున్న దిగుమతులు, మనం జరిపే ఎగుమతుల్లో సగం మాత్రమే ఉన్నాయి.
మెక్సికోతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోని భారత్, చైనా, ఇండోనేషియా వంటి దేశాలపై ఈ దేశ ప్రభుత్వం 50 శాతం వరకు టారిఫ్లు పెంచిన విషయం తెలిసిందే. కొత్త టారిఫ్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ సెక్టార్లకు నష్టం
ఆటోమొబైల్ రంగం: కార్లు వంటి ప్యాసింజర్ వెహికల్ ఎగుమతులపై సుంకం 20శాతం నుంచి 35 శాతానికి పెరుగుతుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 938.35 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఆటో పార్ట్స్ (507.26 మిలియన్ డాలర్ల ఎగుమతుల) పై టారిఫ్ 10–15శాతం నుంచి 35శాతానికి పెరుగుతుంది. మోటార్సైకిళ్ల (390.25 మిలియన్ డాలర్ల ఎగుమతుల)పై కూడా టారిఫ్ 20 శాతం నుంచి 35శాతానికి పెరుగుతుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ మెషినరీ: స్మార్ట్ఫోన్లకు (284.53 మిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్) ఇప్పటి వరకు డ్యూటీ ఫ్రీగా ఉండగా, ఇకపై 35శాతం సుంకం పడుతుంది. ఇండస్ట్రియల్ మెషినరీ (547.99 మిలియన్ డాలర్ల)పై టారిఫ్ 5–10శాతం నుంచి 25–35 శాతానికి పెరుగుతుంది.
లోహాలు: అల్యూమినియం (383.28 మిలియన్ డాలర్ల)పై సుంకాలు 5–10శాతం నుంచి 25–35శాతానికి పెరుగుతాయి. ఇనుము, స్టీల్ (128.44 మిలియన్ డాలర్ల ఎగుమతులు), ఇనుముతో చేసిన ఉత్పత్తుల (176.87 మిలియన్ డాలర్ల)పై సుంకాలు 15శాతం నుంచి 35శాతానికి పెరుగుతాయి.
టెక్స్టైల్స్, గార్మెంట్స్: 245.90 మిలియన్ డాలర్ల విలువైన గార్మెంట్స్పై టారిఫ్ 20–25శాతం నుంచి 35 శాతానికి పెరుగుతుంది. టెక్స్టైల్స్ (149.94 మిలియన్ డాలర్ల) కూడా ప్రభావితమవుతాయి.
కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్: 391.12 మిలియన్ డాలర్ల విలువైన కెమికల్స్, 136.69 మిలియన్ డాలర్ల విలువైన ప్లాస్టిక్స్ ఎగుమతులపై 35 శాతం టారిఫ్ పడుతుంది.
సాగు ఉత్పత్తులు: కాఫీ, టీ, మసాలాలు (36.45 మిలియన్ డాలర్ల) ఎగుమతులపై సుంకాలు 0–5శాతం నుంచి 15 శాతానికి చేరాయి. టారిఫ్లు పెరగడంతో మెక్సికోలో భారత పోటీ సామర్థ్యం దెబ్బతింటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. సప్లయ్ చెయిన్లో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. కాగా, మెక్సికో డబ్ల్యూటీఓలోని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) రూల్స్ను తాజాగా ఉల్లంఘించింది. అమెరికా తర్వాత ఈ రూల్స్ను పట్టించుకోని రెండో దేశంగా నిలిచింది.

