
ముంబై: మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం నష్టాలతో ముగిశాయి. ప్రారంభం లాభాలను వదులుకున్న 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు క్షీణించి 81,444.66 వద్ద ముగిసింది. ఉదయం ఇది 81,858.97 గరిష్ట స్థాయిని తాకింది కానీ తరువాత లాభాలను నిలుపుకోలేక 346.29 పాయింట్లు తగ్గి 81,237.01 కనిష్ట స్థాయికి చేరుకుంది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 41.35 పాయింట్లు తగ్గి 24,812.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సంస్థలలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.79 శాతం అత్యధికంగా నష్టపోయింది. అదానీ పోర్ట్స్ 1.55 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 1.35 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.16 శాతం, నెస్లే 0.95 శాతం పడిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ నష్టాలు కూడా ఇండెక్స్ను కిందికి లాగాయి. రాబోయే 12 నెలల్లో పనితీరు బాగుంటుందని రిపోర్ట్ రావడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 5.12 శాతం పెరిగింది.
టైటాన్ 1.99 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.24 శాతం, మారుతి 1.12 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ స్మాల్క్యాప్ సూచీలు 0.34 శాతం చొప్పున నష్టపోయాయి. "మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరలలో ఊగిసలాట మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దేశీయ మార్కెట్ ప్రారంభ లాభాలను కొనసాగించడంలో విఫలమైంది. అయితే, డిమాండ్ పునరుద్ధరణ అంచనాలతో ఆటో, కన్జూమర్ డిస్క్రిప్షనరీ షేర్లు పెరిగాయి" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
నిఫ్టీ ప్రారంభంలో పైకి ఎగబాకినప్పటికీ, హెవీవెయిట్ స్టాక్ల ఒత్తిడి కారణంగా ఆ ఊపును కొనసాగించడంలో విఫలమైందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్టు అజిత్ మిశ్రా అన్నారు. గురువారం (జూన్ 19) ప్రారంభ ట్రేడ్ల సమయంలో యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశం ఫలితంపై మార్కెట్లు స్పందిస్తాయని చెప్పారు. ‘‘వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని చాలా మంది భావిస్తున్నారు. ఫెడ్ కామెంటరీ, ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సుంకాల ఆందోళనల కారణంగా కీలకం అవుతుంది" అని మిశ్రా అన్నారు.
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లకు నష్టాలు
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో ఐటీ 0.76 శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 0.75 శాతం, యుటిలిటీస్ 0.75 శాతం, పవర్ 0.67 శాతం, కమోడిటీస్ 0.66 శాతం, మెటల్ 0.65 శాతం క్షీణించాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.75 శాతం, కన్స్యూమర్ డిస్క్రిప్షనరీ 0.38 శాతం, ఆటో 0.37 శాతం, బ్యాంకెక్స్ 0.03 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 2,447 స్టాక్లు క్షీణించగా, 1,531 లాభాలను సంపాదించాయి.
ఎక్స్చేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) రూ.1,482.77 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) కూడా గత ట్రేడింగ్లో రూ.8,207.19 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ లాభాల్లో, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాల్లో ముగిశాయి.
యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.35 శాతం తగ్గి బ్యారెల్కు 75.42 డాలర్లకు చేరుకుంది.