- హీట్ వేవ్ ప్రభావం ప్రపంచంలో కెల్లా మనదేశంపైనే ఎక్కువ
- ఫార్మా రంగంలో ఇప్పటికే నష్టాలు
- వరల్డ్ బ్యాంక్ క్లైమేట్ రిపోర్టులో వెల్లడి
తిరువనంతపురం: హీట్వేవ్స్.. రానున్న రోజుల్లో మన దేశంలో ప్రమాదకరంగా మారతాయని, మనం తట్టుకోలేనంతగా టెంపరేచర్ పెరిగిపోతుందని వరల్డ్ బ్యాంక్ రెడీ చేసిన తాజా క్లైమేట్ రిపోర్ట్ వెల్లడించింది. ఇప్పటికే మన దేశంలో హీట్ వేవ్స్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కొన్నేండ్లుగా హీట్వేవ్స్ తీవ్రత పెరుగుతోందని వివరించింది. ప్రపంచ దేశాలలో మనదేశమే వీటి ప్రభావానికి ఎక్కువగా లోనవుతోందని తెలిపింది. ఇలాగే కొనసాగితే మనుషుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఈ రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చ్యునిటీస్ ఇన్ ఇండియా కూలింగ్సెక్టార్” పేరుతో వరల్డ్ బ్యాంక్ రిపోర్టు తయారు చేసింది. కేరళ గవర్నమెంట్ తో కలిసి నిర్వహిస్తున్న ‘‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ పార్టనర్స్ మీట్’’లో ఈ రిపోర్టును అధికారికంగా రిలీజ్ చేస్తుంది. హీట్వేవ్స్ ఎఫెక్ట్ మనదేశంపై రాబోయే కొన్నేండ్ల పాటు ఉంటుందని చెప్పింది.
కర్బన ఉద్గారాలు పెరిగితే..
ఇండియాలో కర్బన ఉద్గారాలు పెరిగితే.. 2036–65 నాటికి ఇప్పటితో పోలిస్తే.. హీట్వేవ్స్ 25 రెట్లు పెరుగుతాయని వరల్డ్బ్యాంక్ తన రిపోర్ట్లో హెచ్చరించింది. ఫలితంగా ఇండియా ఫైనాన్షియల్గా దెబ్బతింటుందని తెలిపింది. దేశంలో 75% మంది (38కోట్లు) కార్మికులున్నారని, వీరంతా ఎండలోనే పనిచేస్తారని చెప్పింది. 2030 నాటికి హీట్, ప్రెషర్ కారణంగా ప్రొడక్టవిటీ తగ్గుతుందని, దీంతో 3.4కోట్ల మంది ఉద్యోగాలు పోతాయని తెలిపింది. వరల్డ్వైడ్గా చూసుకుంటే 8కోట్ల మంది జాబ్ కోల్పోతారని అంచనా వేస్తున్నట్టు చెప్పింది. దక్షిణాసియాలోని దేశాల్లో ఇండియాపై ఇప్పటికే ఈ ఎఫెక్ట్ కనిపిస్తున్నదని, కార్మిక రంగంలో ఏడాదికి 101 బిలియన్ గంటలకుపైగా నష్టపోతున్నట్లు పేర్కొంది. ఇండియాలో ఫుడ్, పబ్లిక్ హెల్త్ సెక్యూరిటీ.. కోల్డ్ చైన్ నెట్వర్క్పై ఆధారపడతాయని గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెక్కిన్సే అండ్ కంపెనీ’ తెలిపింది. కోల్డ్ చైన్ నెట్వర్క్ బ్రేక్ అయితే వ్యాక్సిన్స్, ప్రొడక్ట్స్ దెబ్బతింటాయని చెప్పింది. 4శాతం ప్రొడక్ట్స్కు మాత్రమే కోల్డ్చైన్ ఫెసిలిటీ ఉందని, ఏడాదికి లక్షకోట్ల విలువైన ఫుడ్లాస్ అవుతుందని తెలిపింది.
ఏడాదిలో రూ.28వేలకోట్ల నష్టం
కరోనాకు ముందు ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్గా ఇండియా ఉంది. టెంపరేచర్ సెన్సిటివ్ మెడికల్ ప్రొడక్ట్స్లో 20%, వ్యాక్సిన్లలో 25% దాకా నష్టపోయింది. కోల్డ్ చైన్స్ బ్రేక్కావడంతో ఏడాదికి 28వేల కోట్లు కోల్పోయిందని మేక్ కిన్స్ అండ్ కంపెనీ తెలిపింది. హీట్ పెరగనుండటంతో కూలింగ్కు డిమాండ్ పెరుగుతుందని కూలింగ్ యాక్షన్ ప్లాన్ నివేదిక చెబుతున్నది. ఇండియాలో మూడింట రెండొంతుల మంది రోజుకు రూ.160 కన్నా తక్కువ ఇన్కంతోనే బతుకుతారు. ఏసీ ధర దాదాపు రూ.21వేల నుంచి రూ.41వేల మధ్యలో ఉంటుంది. అప్పుడు ఏసీలు
లగ్జరీ వస్తువు కింద వస్తుందని, దీంతో కొద్దిమందికే ఇవి అందుబాటులో ఉంటాయని యాక్షన్ ప్లాన్ నివేదిక చెప్పింది.
ఇప్పటికే హెచ్చరించిన సైంటిస్టులు
2022 ఏప్రిల్లోనే ఎండ తీవ్రత ఎక్కువ రికార్డయ్యిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఆ టైంలో ఢిల్లీలో 46 డిగ్రీలుగా నమోదైందని గుర్తుచేసింది. మార్చి నాటికి టెంపరేచర్ రికార్డు స్థాయికి చేరిందని వివరించింది. ఇండియాలో మనిషి జీవితంపై హీట్వేవ్స్ చాలా ప్రభావం చూపుతాయని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. దక్షిణాసియా అంతటా ఏటా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతోందని, క్లైమేట్ సైంటిస్టులు ఇప్పటికే హెచ్చరించారని గుర్తుచేసింది. ఇటీవల అక్కడి దేశాల్లో హీట్వేవ్స్ తీవ్రత పెరగడమే దీనికి నిదర్శనమని తెలిపింది. 2021 ఆగస్టులోనే.. ఇండియా సబ్ కాంటినెంటల్లో మరో పదేళ్లలో హీట్వేవ్స్తో పాటు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ఆరో అసెస్మెంట్ రిపోర్టు హెచ్చరించిందని వరల్డ్ బ్యాంక్ గుర్తుచేసింది. అదే ఏడాది జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ కూడా ఇండియాను హెచ్చరించింది.