త్వరలో బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆదివారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఎన్నో హామీల వర్షం కురిపించిన వాస్తవంగా ఫలితాలు ఎలా ఉన్నాయో చూశామని మీడియాతో అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలు గుర్తెరిగారని చెప్పారు. బిహార్లో తాము అత్యధిక స్ధానాలు గెలుచుకున్నామని, పోటీ చేసిన 5 స్ధానాల్లోనూ విజయం సాధించామన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీయే గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్కు ప్రత్యేక హోదా ప్రకంటించాలని లేనిపక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ను కేటాయించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీ(యూ) ఓ తీర్మానం ఆమోదించింది. ఎన్డీయే సర్కార్లో జేడీ(యూ) కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీ బిహార్కు ప్రత్యేక హోదాపై బలంగా గళం వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
