
- జిల్లాల్లో ఆర్గాన్ ట్రాన్స్మిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
- మంత్రి దామోదర రాజనర్సింహ హామీ
నాగర్కర్నూల్, వెలుగు : వైద్య రంగాన్ని మరింత ఆధునికీకరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ... ప్రభుత్వ హాస్పిటల్స్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో క్యాన్సర్, ట్రామాకేర్ సెంటర్, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఆర్గాన్ ట్రాన్స్మిషన్ సెంటర్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. మహబూబ్నగర్లో ఆర్గాన్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పిల్లల విద్య, వైద్యం, భవిష్యత్ను కాపాడేవారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాకు అధిక నిధులు ఇస్తామని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల పొదుపు మంత్రం అద్భుతాలు సృష్టించిదని.. ఆ కష్టాన్ని వృథా చేసుకోకుండా స్వయంసమృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేయాలనిసూచించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీ కృష్ణ, కలెక్టర్ బాదావత్ సంతోష్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమాదేవి, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెండ్ పాల్గొన్నారు.