
- భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి: మంత్రి దామోదర
- డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి
- మెయింటెనెన్స్కు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక మెడికల్, డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్స్ ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ వివరాలను డాక్టర్లతో చర్చించి తెలుసుకోవాలని సూచించారు.
మెడికల్, డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్స్, ఫర్నీచర్ కొనుగోళ్లు, మెడిసిన్ సప్లై, టీ డయాగ్నొస్టిక్స్ పై సోమవారం కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ భవన్ లో అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలకు అనుగుణంగా ఫర్నీచర్ కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు వారంటీ ఉండాలని, మెయింటెనెన్స్ విషయంలో సప్లయర్లను బాధ్యులను చేయాలన్నారు. ఒక్క ఎక్విప్మెంట్ కూడా రిపేర్లో లేదా నిరుపయోగంగా ఉండే పరిస్థితి రాకూడదని హెచ్చరించారు.
స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కోసం కమిటీ
హాస్పిటల్ స్థాయిని బట్టి అవసరమైన ఎక్విప్మెంట్స్ స్టాండర్డ్ జాబితా తయారు చేయాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్తో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి దామోదర ఆదేశించారు.
రాష్ట్రస్థాయిలో టీజీఎంఎస్ఐడీసీ హెడ్ ఆఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్విప్మెంట్ రిపేర్ సమస్యలను ఒక రోజులో పరిష్కరించే విధంగా కొత్త వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. మేజర్ రిపేర్లు ఉంటే 3 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని, స్పేర్ పార్ట్స్ అవసరమైతే సప్లయర్లతో వెంటనే సమన్వయం చేసుకోవాలని తెలిపారు..
3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచండి
సీజనల్ వ్యాధుల కారణంగా పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా మెడిసిన్ స్టాక్ను సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెడిసిన్ సరఫరా విషయంలో వివిధ విభాగాల హెచ్వోడీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్లో కనీసం 3 నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. టీ డయాగ్నొస్టిక్ హబ్స్లో అన్ని రకాల టెస్టులు, స్కాన్లు అందుబాటులో ఉండాలని, ఒక్క టెస్టు కోసం కూడా పేషెంట్ను బయటకు పంపించొద్దని ఆదేశించారు. ప్రతి పీహెచ్సీలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి, 24 గంటల్లో రిపోర్టులు అందజేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో మెడిసినల్ స్టోర్స్ కోసం పర్మినెంట్ బిల్డింగ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.