
- మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసే కుట్ర
- మాజీ మంత్రి హరీశ్ రావు
ఖమ్మం / సత్తుపల్లి : బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించడం ద్వారా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ కళ్లు తెరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ సత్తుపల్లిలో పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ ను ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతారన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పాటు మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ తెలంగాణ ప్రజల హక్కు అని అన్నారు . తెలంగాణతో కేసీఆర్ ది పేగు బంధమని పేర్కొ న్నారు. తెలంగాణ హక్కులు సాధించాలంటే రాకేశ్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ , బీజీపీ వల్ల ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ఏపీకి కోల్పోయామన్నారు. కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.