బూస్టర్ డోస్ టీకాలు కావాలని కేంద్రాన్ని కోరిన హరీష్

బూస్టర్ డోస్ టీకాలు కావాలని కేంద్రాన్ని కోరిన హరీష్

తెలంగాణ రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవిషీల్డ్ 80 వేలు ఉండగా.. కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ వేగవంతం చేసిందుకు అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే.. తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా ఏర్పాటు చేసిన వీడియో సమీక్షలో హరీష్ రావు పలు విన్నతులు చేశారు. 

వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని హరీష్ రావు కోరారు. ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లను సమీప ఆసుపత్రులతో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకు రావాలన్నారు. యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పిఎస్ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు ఇసిఆర్‭పి -3  రూపొందించే విషయమై ఆలోచించాలన్నారు.