పిల్లలను సర్కార్ బడులకు పంపండి..ప్రైవేట్ స్కూళ్లకు తోలి అప్పుల పాలు కావొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు

పిల్లలను సర్కార్ బడులకు పంపండి..ప్రైవేట్ స్కూళ్లకు తోలి అప్పుల పాలు కావొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
  • చదువు కోసం అవసరానికి మించి డబ్బులు ఖర్చు పెడ్తున్నరు
  • సర్కార్ దవాఖానాల్లోనే మెరుగైన వైద్యం
  • కష్టార్జితం కార్పొరేట్ హాస్పిటళ్ల పాలు చేయొద్దని వినతి
  • కవులు, కళాకారుల సదస్సుకు మంత్రి హాజరు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నప్పటికీ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్కడ విద్య బాగాలేకపోయినా.. ఫీజుల రూపంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం మెరుగైన విద్యతో పాటు వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. హైదరాబాద్​లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రభుత్వ పథకాలు- సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలపై సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజరై, మాట్లాడారు.

ఒక్కో స్టూడెంట్ 15 ఏండ్ల చదువు కోసం రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైద్యం విషయంలోనూ ప్రజలంతా భారీగా డబ్బులు ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. ‘‘ప్రభుత్వ దవాఖానాలు ఉన్నా.. ప్రైవేట్ హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవు. సామాజిక రుగ్మత‌ల‌ను రూపుమాపాలి. అప్పుడే న‌వస‌మాజం నిర్మితం అవుతుంది.

స‌మాజ అభివృద్ధికి క‌వులు, ర‌చ‌యిత‌లు, సాహితీవేత్తలు, క‌ళాకారులు, మేధావులు కృషి చేయాలి. సంస్కృతి.. కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదు. సంస్కృతి అంటే.. మన అస్తిత్వం. ప్రజల ఆలోచ‌నా ధోరణి మారింది’’అని జూపల్లి అన్నారు. ఆహార‌పు అల‌వాట్లు మారడంతో ప్రజలు అనారోగ్యం బారిన ప‌డుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నప్పటికీ కొంత మంది ఆడంబరాలకుపోయి స్థాయికి మించి ఖర్చు చేస్తూ అప్పుల పాల‌వుతున్నారన్నారు. క‌ష్టప‌డి సంపాదించిన డ‌బ్బును కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిట‌ళ్ల పాలు చేయొద్దని కోరారు.

ఉద్యోగ అవకాశాలు కల్పించండి: కవులు, కళాకారులు

క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, సాహితీవేత్తలు, మేధావులు స‌ద‌స్సులో వారి అభిప్రాయాలు పంచుకున్నారు. నర్సింగారావు సమర్పించిన సాంస్కృతిక విధాన ప‌త్రాన్ని అమ‌లు దిశ‌గా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. అర్హులైన‌ క‌ళాకారుల‌కు సాంస్కృతిక క‌ళా సారథిలో ఉద్యోగ అవ‌కాశాలు కల్పించాలని కోరారు. జాన‌ప‌ద కళాకారుల పారితోషికాన్ని పెంచాల‌ని, అర్హులైన వృద్ధ కళాకారుల‌కు పింఛ‌న్ వ‌ర్తింప‌జేయాల‌ని, జీవిత‌, ఆరోగ్య బీమా క‌ల్పించాల‌ని, హెల్త్ కార్డులు ఇవ్వాల‌ని మంత్రి జూపల్లికి విన్నవించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. యువత చెడు వ్యసనాల బారినపడకుండా ప్రముఖులతో సందేశాలు ఇప్పించాలన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక కళా సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల, పర్యాటక, సాంస్కృతిక స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, ప్రజాకవి అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలు నేటి సమాజాన్ని పీడిస్తున్నాయని మంత్రి జూపల్లి అన్నారు. సమాజాన్ని తట్టిలేపే శక్తి.. కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని తెలిపారు. ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కలాలకు పదును పెట్టాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సులో చర్చించిన అంశాలపై కమిటీ వేసి కార్యాచరణ రూపొందించాలని, దీనికి సమన్వయకర్తగా ప్రొఫెసర్ కోదండరాం వ్యవహరించాలని కోరారు. వీధి నాటకాలు, నాట్యం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్గించాలని, అవసరమైతే రూ.10 కోట్లు కేటాయిస్తానని జూపల్లి తెలిపారు.