
హైదరాబాద్, వెలుగు: దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెడతామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. దేవుడి భూములపై లీగల్ గా గట్టి ఫైట్ చేయాలని, న్యాయపోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని ఆమె ప్రశ్నించారు. శనివారం సెక్రటేరియెట్లోని దేవాదాయ శాఖ మంత్రి పేషీలో దేవాదాయ శాఖ న్యాయవాదులతో మంత్రి సమావేశమయ్యారు. ఎండోమెంటు భూముల కబ్జా కేసుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎండోమెంటు న్యాయవాదుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవుడి భూములు కాపాడటంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. దేవాదాయ భూముల కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. దేవుడి భూములు కాపాడటంలో లీగల్ టీమ్ పాత్ర కీలకమైందన్నారు.
దేవాదాయశాఖ మంత్రినైనా.. ఎన్ని కేసులు గెలిచామో ఇప్పటికీ తనకు సమాచారం లేదని, కేసుల విషయంలో అప్డేట్ అడిగితే డిపార్ట్మెంట్లో ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేవుడి భూములు మనం దక్కించుకోవాలని, దూరదృష్టితో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఏ కేసులపై న్యాయ పోరాటం చేశారు. వాటి పరిష్కారంలో ఎదురైన ఇబ్బందులపై న్యాయవాదులను మంత్రి ప్రశ్నించగా.. 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగ్ ఉన్నాయని, 543 కోర్టు కేసులను డిస్పోజ్ చేసినట్లు వివరించారు.
కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్ కాపీ ఎండోమెంటు శాఖ సెక్రటరీకి అందజేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఎండోమెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు, అడిషనల్ కమిషనర్లు కృష్ణ ప్రసాద్, కృష్ణవేణి, న్యాయవాదులు (జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.