హైదరాబాద్: గాంధీ భవన్లో గాడ్సేలు దూరరాని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సొంత పార్టీ బాగోగులు పట్టించుకోకుండా.. ఇతర పార్టీల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాని ప్రశ్నించారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు హైటెక్స్ చేరుకున్న కేటీఆర్ పైవ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగామన్నారు.
గులాబీ చొక్కాలు, చీరలు కంపల్సరీ
‘తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. కానీ పరిపాలనను కొత్త మలుపులు తిప్పి రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికి దిక్సూచిగా నిలిపారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా మా జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలో భాగంగానే ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఆరు వేలకు పైగా ప్రతినిధులు ప్లీనరీకి హాజరు కానున్నారు. గులాబీ చొక్కాలు, చీరలు ధరించి రావాలని ప్రతినిధులకు పిలుపునిచ్చాం. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఏడు అంశాల మీద తీర్మానాలు ఉంటాయి’ అని కేసీఆర్ చెప్పారు.
చీకటి ఒప్పందాలు బయటపడతాయ్
‘హుజురాబాద్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై టీఆర్ఎస్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. గోల్కొండ హోటల్లో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా కలిశారని సమాచారం ఉంది. ఇద్దరు కలిసింది నిజామో కాదో స్పష్టం చేయాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కై.. బీజేపీ అభ్యర్థులను గెలిపించింది నిజం కాదా? ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలు బయటపడతాయి. పీసీసీ అధ్యక్ష పదవికి ఏ విధంగా సుపారీ తీసుకోవచ్చో మాణిక్యం ఠాగూర్ను అడిగితే బాగుంటుంది. రూ. 50 కోట్లకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాగూర్ ఇప్పటి వరకు స్పందించలేదు’ అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు పెద్ద పీట వేస్తున్నారని పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ఆరోపించారని కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో గాడ్సేలు దూరారని.. దళిత బంధును ఆపడం ఏమాత్రం సబబో ఎన్నికల కమిషన్ ఆలోచించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.