- గుర్తించిన ఐటీ అధికారులు
- మంత్రి సహా 16 మంది డైరెక్టర్లకు నోటీసులు
- 28, 29వ తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం
- డాక్యుమెంట్లను తీసుకురావాలని స్పష్టీకరణ
మల్లారెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా -ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ల్యాప్టాప్ మాయం
ల్యాప్టాప్ దొంగిలించి, సాక్ష్యాలు తారుమారు చేశారని పోలీసులకు ఆఫీసర్ ఫిర్యాదు
మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన బోయిన్పల్లి పోలీసులు
స్టేట్మెంట్లో రూ.100 కోట్ల బ్లాక్ మనీ అని రాసుకున్నరు: మల్లారెడ్డి
మహేందర్రెడ్డికి ఇంగ్లిష్ రాదని, అయినా ఇంగ్లిష్ స్టేట్మెంట్పై సైన్ చేయించారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బ్లాక్మనీని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. మంత్రికి చెందిన16కు పైగా కంపెనీల్లో జరిపిన తనిఖీల్లో రూ.వందల కోట్ల హవాలా ట్రాన్సాక్షన్స్ గుట్టు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి సహా సంబంధిత కంపెనీలకు చెందిన 16 మంది డైరెక్టర్లకు గురువారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28, 29వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్స్ను తీసుకురావాలని స్పష్టం చేసింది. మరోవైపు స్వాధీనం చేసుకున్న హవాలా ట్రాన్సాక్షన్స్ ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఐటీ శాఖ లెటర్ రాయనుంది. ఆధారాలను ఈడీకి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
అర్ధరాత్రి మల్లారెడ్డి హైడ్రామా
పన్ను ఎగవేత, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సం బంధిత వ్యక్తుల వద్ద ఐటీ అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వాటిపై సంతకాలు తీసుకున్నారు. సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి వద్ద సంతకాలు తీసుకున్నారు. ఇందుకోసం ఐటీ డిప్యూటీ కమిషనర్ రత్నాకర్ ఆధ్వర్యంలోని టీమ్.. బుధవారం రాత్రి మహేందర్ రెడ్డిని కలిసి, సంతకాలు తీసుకున్నది. ఈ విషయం తెలియడంతో అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో మల్లారెడ్డి అరుస్తూ ఇంటి నుంచి బయటికొచ్చారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే డ్రైవర్తో కలిసి సూరారంలోని హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. ‘‘ఆరోగ్యం బాగాలేని తన కొడుకు మహేందర్రెడ్డి వద్ద బల వంతంగా సంతకాలు తీసుకున్నారు. చిన్న కొడు కు భద్రారెడ్డి సంతకాలు తీసుకోవాలని చెప్పినా వినలేదు. మహేందర్రెడ్డికి ఇంగ్లీష్ రాదు. కానీ మమ్మల్ని మోసం చేసి, ఇంగ్లీష్లో రాసిన స్టేట్మెంట్లో సంతకాలు చేయించారు. రూ.100 కోట్ల బ్లాక్ మనీ అని రాసుకున్నారు. ఆ డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి” అని ప్రశ్నించారు.
పరస్పర ఫిర్యాదులు
తర్వాత హాస్పిటల్లో ఉన్న ఐటీ డిప్యూటీ కమిషనర్ రత్నాకర్ను మల్లారెడ్డి తన వెహికిల్లోనే ఎక్కించుకుని సికింద్రాబాద్లోని ఇంటికి తీసుకువచ్చారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంట్లో వాగ్వాదం జరగడంతో 10 నిమిషాల తర్వాత ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది బయటికి వచ్చారు. 2.30గంటల టైంలో మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి ఐటీ అధికారి రత్నాకర్ను బలవంతంగా బోయిన్పల్లి పీఎస్కు తీసుకువచ్చారు. హాస్పిటల్లో ఉన్న తన కుమారుడు మహేందర్రెడ్డి వద్ద బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి బోయిన్పల్లి పీఎస్కి చేరుకున్నారు. మల్లారెడ్డి అనుచరులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే పీఎస్లో ఉన్న ఐటీ అధికారి రత్నాకర్.. మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సెర్చ్ వారెంట్తో సోదాలు చేస్తున్న తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. సోదాల సమయంలో తన ల్యాప్టాప్ను మాయం చేశారని, అసభ్యకర పదజాలంతో దూషించారని తెలిపారు. ల్యాప్టాప్తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
ల్యాప్టాప్ మాయం
ల్యాప్టాప్ను తిరిగి ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. తన అనుచరులతో ఓ ల్యాప్టాప్ పంపించారు. అయితే అది తమది కాదని ఐటీ అధికారి రత్నాకర్ చెప్పారు. వేరే ల్యాప్టాప్ తెచ్చారని, తమ ల్యాప్టాప్లో విలువైన సమాచారం ఉందని తెలిపారు. మల్లారెడ్డి అనుచరులు తీసుకొచ్చిన ల్యాప్ టాప్ తీసుకునేందుకు నిరాకరించారు. తర్వాత 3.30 టైంలో మరో ఇద్దరు కార్యకర్తలు డెల్ ల్యాప్టాప్ను తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్ లోపలికి అనుతించకపోవడంతో అక్కడ ప్రహరీ గోడ గేట్ వద్ద పెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ ల్యాప్టాప్ను ఐటీ అధికారులు తీసుకోలేదు. పథకం ప్రకారమే ల్యాప్టాప్ను తారుమారు చేశారని పోలీసులకు తెలిపారు. సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ అధికారుల సూచనల మేరకు ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.