
- ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కూసుమంచి, వెలుగు : పదేండ్లలో బీఆర్ఎస్ పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలు ఆపబోమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో శనివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల హామీల్లో ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న వడ్లకు రూ.500 బోనస్, సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మిగిలిన పథకాలను అమలు చేస్తామని చెప్పారు.
కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో సీసీ రోడ్డు, బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ.74.57 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. అనంతరం ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్అడ్బీ ఎస్ఈ యాకుబ్, పీఆర్ఎస్ఈ వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏడీఏ సరిత, సీడీసీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సుధాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, బజ్జూరి వెంకట్రెడ్డి, రాంనాయక్ పాల్గొన్నారు.