
- మంత్రి పొంగులేటితో లబ్ధిదారులు ప్రొసీడింగ్స్, కొత్త బట్టలు అందజేత
యాదాద్రి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మొదటి, రెండో విడత బిల్లులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పలువురు లబ్ధిదారులు తెలిపారు. కొందరు రూ.లక్ష వచ్చిందని, మరికొందరు తమకు రూ.4 లక్షలు వచ్చాయని తెలిపారు. యాదాద్రి జిల్లా వాసాలమర్రి, బండ సోమారం, సూర్యాపేట జిల్లా విభళాపురంలో మంత్రి పర్యటించారు. వాసాలమర్రిలో 205 మందికి ఇండ్లు మంజూరు కాగా, ఆగవ్వ సహా మరికొందరికీ ప్రొసీడింగ్స్ అందించారు. అనంతరం భువనగిరి మండలం బండ సోమారంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. పలువురు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు.
వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఆ తర్వాత 146 ఇండ్లు మంజూరైన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభళాపురంలో మంత్రి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న పలు ఇండ్లను పరిశీలించి, 76 మంది లబ్ధిదారులకు కొత్త బట్టలు బహూకరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఇల్లు నిర్మాణపు బిల్లు వచ్చిందా..? అని ఆరా తీశారు. దీంతో రెండు విడతలుగా తమకు రూ. 2 లక్షల వచ్చాయని జంపల పద్మ, తనకు రూ.4 లక్షలు వచ్చాయని పనస శ్రీలత తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు : ప్రభత్వ విప్ బీర్ల ఐలయ్య
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. వాసాలమర్రిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి, వారిని కోటీశ్వరులుగా చేయాలని
సంకల్పించిందన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు : ఎమ్మెల్యే కుంభం
ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో నీరు లేకుండా ఒక్క ఎకరా కూడా ఎండిపోదని
తెలిపారు.
ఇల్లు పేదోడి కల : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
సొంతిళ్లు ఉండాలన్న ప్రతి పేదోడి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తెలిపారు. విభళాపురం గ్రామాన్ని పైలట్ప్రాజెక్టుగా ఎంపిక చేసి 146 ఇండ్లు మంజూరు చేసినందుకు మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ే బండ్రు శోభారాణి, యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు హనుమంతరావు, తేజస్ నందలాల్ పవార్, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్య, రేఖ, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, వేణుమాధవరావు, హౌసింగ్ పీడీలు విజయ్ సింగ్, ధర్మారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కడుపు నిండా అన్నం - ఎంపీ చామల
సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రతి పేదవాడికి కడుపు నిండా తిండి అందుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలో ఇల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ప్రతిఒక్కరికీ ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.