నల్గొండ జిల్లాలో పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ జిల్లాలో పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •  జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం 
  •  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  •  పేదలు బాగుండాలనేదే ప్రభుత్వ లక్ష్యం 
  •  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు : ఇచ్చినమాట ప్రకారం పేదల సొంతింటి కల నెరవేరుస్తామని, నాలుగు విడతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రానున్న మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. 

మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రూ.22,500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. రాబోయే వారం, పది రోజుల్లో పైలెట్ గ్రామాల్లో గృహప్రవేశాలు చేయబోతున్నామని తెలిపారు. 400 నుంచి 600 చదరపు అడుగుల్లోపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు పూర్తి చేసుకుంటే అంత త్వరగా బిల్లు వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. 

దేశానికి మన రెవెన్యూ వ్యవస్థ రోల్ మోడల్ గా ఉండబోతున్నదని, వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా పెట్టుకుని వెళ్తామన్నారు. ఈనెల 20 నుంచి ఆగస్టు 15 నాటికి భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ తప్పులు చేస్తే సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రానున్న 30 రోజుల్లో రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్డ్స్ సర్వేయర్లను నియమించనున్నట్లు ప్రకటించారు.  

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇండ్లు.. 

చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇండ్లు వస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 18 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దాదాపు16.50 లక్షల వరకు అర్హులను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులతోపాటు లిఫ్ట్​లను పూర్తి చేస్తామన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మరమ్మతులకు త్వరలోనే రూ.7 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్​ను పూర్తి చేస్తామని చెప్పారు. 

30 టీఎంసీల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీరందిస్తామని వెల్లడించారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని  కాల్వ పనులు పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ సీజన్లలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే నెంబర్ వన్ గా రాష్టం నిలిచిందన్నారు. 

పేదలు బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..

పేదలు బాగుండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదని ఆరోపించారు.  పెండింగ్​ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం,  ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయం చారిత్రాత్మకం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

సూర్యాపేట, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయం చారిత్రాత్మకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆవరణలో శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పాత బస్సులు, డీజిల్‌‌‌‌‌‌‌‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీంతో వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ బస్సులు మంజూరయ్యాయని, వాటిలో మొదటి విడతలో 45 బస్సులను ఒకేసారి ప్రారంభించామని తెలిపారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘సుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ’ అంటూ సూర్యాపేటకు ఉన్న ఖ్యాతిని గుర్తించి 79 బస్సులను కేటాయించామన్నారు. ‘కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం, ఆర్టీసీ పరిరక్షణ’ అనే మూడు నినాదాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూర్యాపేట డిపో నుంచి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ ప్రాంతాలకు ఈ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అమ్మగారి ఇంటికి, పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు.