వంశీని గెలిపిద్దాం..సోనియమ్మకు గిఫ్ట్​ ఇద్దాం : మంత్రి సీతక్క

వంశీని గెలిపిద్దాం..సోనియమ్మకు గిఫ్ట్​ ఇద్దాం : మంత్రి సీతక్క

తాత కాకా వెంకటస్వామి పేరు నిలబెడుతూ ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్​ ఇద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ‘‘34 ఏండ్ల తర్వాత ఇందిరమ్మ ఫ్యామిలీ నుంచి రాహుల్ ప్రధాని కావాలంటే వంశీ లాంటి వారిని ఎంపీలుగా గెలిపించాలి. ప్రతి బూత్​లో అత్యధిక మెజారిటీ తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరిగే చట్టాలు వస్తాయి. 

కాంగ్రెస్ ఉపాధి చట్టం తేకుంటే ఊర్లల్లో రోడ్లు ఉండేవి కావు. మోదీ ప్రభుత్వం అటవీ హక్కులకు తూట్లు పొడిచింది. మోదీకి అదానీ, అంబానీ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. సింగరేణిని ప్రైవేట్​కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నరు. దేశ వనరులను దోస్తులకు దోచిపెడుతున్నడు’’ అని విమర్శించారు. పేదలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. 

ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్​లను పక్కదారి పట్టించడం కోసం కేసీఆర్ దొంగ రైతు దీక్షలు చేయిస్తున్నాడని ఆరోపించారు. వంశీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఎన్నికల తర్వాత నామినేటెడ్​ పదవుల్లో ఉంటారని హామీ ఇచ్చారు.