కంపెనీలపై దుష్ర్పచారం చేస్తే సహించబోం: మంత్రి శ్రీధర్​బాబు

కంపెనీలపై దుష్ర్పచారం చేస్తే సహించబోం: మంత్రి శ్రీధర్​బాబు
  • అక్కసుతోనే అబద్ధాలు
  • కేన్స్​ ఎక్కడికీ పోలేదు.. 
  • రాష్ట్రం నుంచి ఏ కంపెనీ వెళ్లదు
  • దావోస్​ పర్యటనతో రూ.9 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్స్ ​వచ్చాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  ఎంపీ ఎన్నికల్లో  సీట్లు రావనే అక్కసుతోనే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం  శ్రీధర్​బాబు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

పదేండ్లలో జరిగిన తప్పులను 3 నెలల నుంచి సెట్ చేస్తున్నామని, ఇంతలోనే ఎంపీ ఎలక్షన్​ కోడ్ వచ్చిందని తెలిపారు. మార్పునకు అడ్డు వస్తే సహించేది లేదని, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని హెచ్చరించారు. తమ సర్కారు  ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్​పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పవర్ , సివిల్ సప్లై, ఇరిగేషన్, ఇండస్ట్రీస్​పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.  

కరెంట్​పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు

కరెంట్ పై ప్రజలను బీఆర్ఎస్​ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. నిరుడు బీఆర్ఎస్​ పాలనలో వందలసార్లు కరెంట్​ కోతలు ఏర్పడి, వరంగల్​ఎంజీఎం దవాఖానలో పేషెంట్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అదే దవాఖానలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు.

కానీ ఇటీవల జనరేటర్​ఆన్​ కాకపోతే రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆ పార్టీ పత్రిక లో వార్తలు రాయించారని ఫైర్​ అయ్యారు. భువనగిరిలో11 కేవీ ఫీడర్ ట్రిప్ అయితే 30 నిమిషాల్లో అధికారులు సెట్ చేశారని చెప్పారు. సూర్యాపేట బస్ యాత్రలో అక్కడ కరెంట్ కనెక్షన్ తీసుకోలేదని, జనరేటర్ పెట్టి అది ఆఫ్ చేసి కరెంట్ పోయిందని బీఆర్ఎస్​ నేతలు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేశారని మండిపడ్డారు. కొన్ని సార్లు ప్రభుత్వ పరిధిలో లేకుండా ప్రకృతి వైపరీత్యాలతో పొరపాట్లు జరుగుతాయని, వాటికి విద్యుత్​శాఖను బద్నాం చేయొద్దని సూచించారు. 

కంపెనీలు ఎక్కడికీ పోవట్లే

రాష్ట్రం నుంచి కంపెనీలు ఎక్కడికీ పోవట్లేదని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. దావోస్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ. 9వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్స్​ వచ్చాయని వెల్లడించారు. కేన్స్ కంపెనీతో అక్టోబర్  2023 లో ఒప్పందం జరిగిందని,  కేంద్రం నుంచి ఈ కంపెనీకి సబ్సిడీ రావాల్సి ఉందని చెప్పారు. అందుకోసం ఆ కంపెనీ వెయిట్ చేస్తుంటే..  ఈ కంపెనీ వెళ్లిపోయిందని కేటీఆర్​దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.  2016 నుంచి చిన్న పరిశ్రమలకు  రూ.3వేల కోట్ల సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు. 

ఏలేటికి ఇపుడు సోయి వచ్చిందా?: జీవన్ రెడ్డి

‘‘బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడు సోయి వచ్చిందా?  గత పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పులు కనిపించడం లేదా?’’ అని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రశ్నించారు.  పేపర్​లో పేరువస్తే చాలని మహేశ్వర్​రెడ్డి అనుకొని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. ఎక్కువ మాట్లాడితే పెద్ద లీడర్​ అవ్వరని, వాస్తవాలు మాట్లాడితేనే అవుతారని చెప్పారు. సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రమే కారణం కాదా? అని ప్రశ్నించారు. 

మంత్రులతో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ భేటీ

గాంధీ భవన్ లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ( దర్శకుడు రాజమౌళి తండ్రి ) భేటీ అయ్యారు. ఈ భేటీకి, రాజకీయాలకు సంబంధం లేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పేపర్ లీకేజ్ కాకుండా, చేనేత పరిశ్రమకు ఇండస్ట్రీస్​ డిపార్ట్ మెంట్ చేయాల్సిన అంశాలపై మంత్రికి పలు సూచనలు చేశానని వెల్లడించారు. 

పీసీసీ కొత్త చీఫ్​పై చర్చ!

మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కొత్త చీఫ్ గురించి చర్చ జరిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.